
దుబాయ్: గాయం కారణంగా ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో కర్ణాటకకు చెందిన ప్రవీణ్ దూబేను జట్టులోకి తీసుకుంటున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం తొమ్మిది మ్యాచ్లు ఆడి ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ.. గాయపడి టోర్నీకి దూరమైన ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ మిశ్రా స్థానంలో 27 ఏళ్ల అన్క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబేను తీసుకున్నారు.
ఈ సీజన్లో అమిత్ మిశ్రా మూడు మ్యాచ్లే ఆడాడు. అక్టోబర్ 3న షార్జా వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. మిశ్రా ఉంగరం వేలికి గాయమవడంతో అతను సీజన్ నుంచి నిష్క్రమించాడు. సర్జరీ చేయించుకొన్న మిశ్రా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఐపీఎల్లో మిశ్రా 160 వికెట్లు తీశాడు. మిశ్రా స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఢిల్లీ అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ప్రవీణ్ దూబే అవకాశం దక్కించుకున్నాడు. మిశ్రా టోర్నీ నుంచి వైదొలిగిన రెండు వారాల తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేశారు.
కర్ణాటకకు చెందిన ప్రవీణ్ దూబే ఈ ఏడాది ఆరంభంలో తన ఫస్ట్క్లాస్ కెరీర్ను ప్రారంభించాడు. ఇప్పటివరకూ ఒకే ఒక్క ఫస్ట్క్లాస్ మ్యాచ్ను ఆడాడు. ఇక 8 లిస్ట్-ఎ మ్యాచ్లు, 14 టీ20 మ్యాచ్లు ఆడాడు. కాగా ప్రవీణ్ దూబే వెలుగులోకి వచ్చింది మాత్రం 2015లో. కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఆడిన సమయంలో బెంగళూరును ఆకర్షించాడు. దాంతో 2016లో అతన్ని ఆర్సీబీ తీసుకుంది. అతని కనీస ధర రూ. 35లక్షలకు కొనుగోలు చేసింది. రెండు సీజన్ల పాటు ఆర్సీబీ వెంటే ఉన్నాడు ప్రవీణ్ దూబే. కానీ ఆ తర్వాత అతన్ని రిలీజ్ చేయగా, ఎవరూ కొనుగోలు చేయలేదు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని తీసుకోవడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.
'నాకు చాలా సంతోషంగా ఉంది. నా టాలెంట్ను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు ఢిల్లీ ఫ్రాంచైజీకి ధన్యవాదాలు. నా సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్తో కలిసి బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా' అని ప్రవీణ్ దూబే తెలిపాడు. ఇషాంత్ శర్మ కూడా గాయపడి టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పేస్ విభాగంలో ఢిల్లీకి ఎటువంటి ఇబ్బంది లేదు. రబడా, నోర్జే, దేశ్పాండేలు పేస్ విభాగంలో ఉన్నారు. అందుకే ఇషాంత్ స్థానాన్ని ఇంకా భర్తీ చేయలేదు.