
హైదరాబాద్: ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 17 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ చేతిలో ఓడినా.. వార్నర్ సేన అద్భుతమైన ఆటతీరుతో అందర్నీ కట్టిపడేసింది. ఓ దశలో భారీ ఓటమితో ఓడుతుందనుకున్న తరుణంలో కేన్ విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా రాణించి గెలుపై ఆశలు రేపారు. అయితే కీలక దశలో ఇద్దరూ పెవిలియన్ చేరడంతో సన్రైజర్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్లో సన్రైజర్స్ యువ హిట్టర్ అబ్దుల్ సమద్ ఆడిన తీరు అందరిని ఆకట్టుకుంది. రెండు భారీ సిక్సులు కూడా బాదాడు. ఢిల్లీ స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ వేసిన ఓ ఫుల్ టాస్ బంతిని సమద్.. భారీ సిక్సర్ బాదాడు. అంతకుముందు కూడా జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, కాగిసో రబాడా లాంటి టాప్ బౌలర్ల బౌలింగ్లో కూడా సునాయాసంగా సిక్సర్లు బాదాడు. అద్భుతంగా ఆడుతున్న సమద్పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు గుప్పించారు. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్.. సమద్ ఆడిన తీరుపై ట్వీట్లు చేశాడు.
భవిష్యత్తులో అబ్దుల్ సమద్ గొప్ప ఆటగాడు అవుతాడని హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. 'భవిష్యత్తులో అబ్దుల్ సమద్ ప్రత్యేకమైన, గొప్ప ఆటగాడు అవుతాడు. ఢిల్లీతో మ్యాచ్లో అన్రిచ్ నోర్జ్ బౌలింగ్లో పుల్ షాట్తో పాటు కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు' అని హర్భజన్ కొనియాడాడు. సమద్ ఆటతీరు బాగుందని.. భవిష్యత్తులో స్పెషల్ ప్లేయర్ అవుతాడని యువీ కూడా ట్వీట్ చేశాడు. 'సమద్.. బాగా ఆడావు. ఐపీఎల్ 2020లో బుమ్రా, రబాడా, నోర్జ్, కమిన్స్ బౌలింగ్లో సిక్సర్లు కొట్టానని జమ్మూ కాశ్మీర్లోని మీ స్నేహితులకు గర్వంగా చెప్పుకో' అని ఫాన్స్ ట్వీట్ చేస్తున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ లోయర్ ఆర్డర్లో పవర్ హిట్టర్ అవసరం కావడంతో ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ అబ్దుల్ సమద్ను ఎంపిక చేసుకున్నాడు. జమ్మూ కశ్మీర్కు చెందిన టీనేజ్ క్రికెటర్ సమద్.. ఈ సీజన్లో తొలిసారి ఐపీఎల్ బరిలో దిగాడు. గత రంజీ సీజన్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఆడిన తొలి సీజన్లో సమద్ ఆకట్టుకున్నాడు.