
అబుదాబి: ఐపీఎల్ 2020లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కీలక మ్యాచ్ కోసం ఢిల్లీ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. అజింక్య రహానె, అక్షర్ పటేల్, డేనియల్ శామ్స్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు కోహ్లీసేన రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గుర్కీరత్ మన్పై వేటు పడగా.. నవదీప్ సైనీ ఫిట్నెస్ సమస్యతో దూరమయ్యాడు. వీరి స్థానాల్లో శివమ్ దూబే, షబాజ్ అహ్మద్ టీమ్లోకి వచ్చారు.
ఈ సీజన్లో టాప్-2 ప్లేస్ కోసం జరిగే కీలక మ్యాచ్లో ఢిల్లీ, బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు రెండో స్థానంను దక్కించుకుంటే.. ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ కష్టమవుతుంది. మిగతా జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ గందరగోళాన్ని తప్పించుకునేందుకు ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే సీజన్ ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీ 59 పరుగులతో ఆర్సీబీని చిత్తుచేసింది. దాంతో ఈ ఓటమిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన భావిస్తుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 7 గెలిచి 14 పాయింట్లతో ఆర్సీబీ, ఢిల్లీ 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది. ఓడిన టీమ్ భవితవ్యం మాత్రం.. హైదరాబాద్- ముంబై మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తే ఏ సమస్యలేదు. కానీ ఓడితే మాత్రం మెరుగైన రన్రేట్ కారణంగా హైదరాబాద్ టాప్-3లో నిలుస్తోంది. అప్పుడు నాలుగో స్థానం కోసం ఆర్సీబీ, ఢిల్లీ మ్యాచ్లో ఓడిన జట్టు కోల్కతా మధ్య పోటీ నెలకొంటుంది. రన్రేట్ కీలకం అవుతుంది. కాబట్టి రన్ రేట్ మెరుగ్గా ఉండాలంటే ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్లో ఆర్సీబీ 22 పరుగుల వ్యత్యాసంతో లేదా 18 బంతులు మిగిలుండగా ఓడిపోవద్దు. ఇక ఢిల్లీ 20 పరుగులు, 15 బంతుల వ్యత్యాసంతో పరాజయం పాలవద్దు.
తుది జట్లు:
బెంగళూరు: దేవదత్ పడిక్కల్, జోష్ ఫిలిప్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (కీపర్), శివమ్ దూబే, షబాజ్ అహ్మద్, ఇసురు ఉడానా, క్రిస్ మోర్రిస్, యుజ్వేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్.
ఢిల్లీ: పృథ్వీషా, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), మార్కస్ స్టోయినిస్, డేనియల్ శామ్స్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్.