దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా దుబాయ్ వేదికగా మరికొద్ది సేపట్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో కూడా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. పొలార్డ్ తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. హార్దిక్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్ స్థానంలో జయంత్ యాదవ్, నాథన్ కౌల్టర్-నైల్ ఆడుతున్నారు. మరోవైపు ఢిల్లీ సారథి శ్రేయాస్ అయ్యర్ మూడు మార్పులు చేశాడు. పృథ్వీ షా, హర్షల్ పటేల్, ప్రవీణ్ దూబే ఆడుతున్నారు.
ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కీలకం. ఈ రోజటి మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి సమీకరణలు అవసరం లేకుండా ఢిల్లీ ప్లేఆఫ్ చేరుకుంటుంది. ఓడితే ఇంకో మ్యాచ్ రూపంలో మరో అవకాశం కూడా ఉంది. రెండు మ్యాచ్ల్లో ఢిల్లీ ఓడినప్పటికీ ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే సన్రైజర్స్ ఒక మ్యాచ్లో ఓడాలి లేదంటే.. బెంగళూరు కచ్చితంగా ఓ మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది. ఇక ఢిల్లీ రెండిటిలో ఓడితే మాత్రం నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్ చేరినా.. టాప్-2లో నిలిచే ఛాన్స్ మాత్రం ఉండదు.
ప్రస్తుతానికి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేదు. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్కు చేరుకుంది. అంతేకాదు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముంబై మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం దుబాయ్ వేదికగా ఢిల్లీ.. మంగళవారం షార్జాలో హైదరాబాద్తో తలపడనుంది. ఈ రెండింట్లోనూ గెలిచి పట్టికలో అగ్రస్థానంలో కొనసాగాలని పట్టుదలతో ఉంది. ఎందుకంటే.. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు నాకౌట్స్లో ఓడినా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం దొరుకుతుంది.
తుది జట్లు:
ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మైయిర్, హర్షల్ పటేల్, ప్రవీణ్ దూబే, కగిసో రబాడా, ఆర్ అశ్విన్, అన్రిచ్ నోర్జ్.
ముంబై: క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైల్, రాహుల్ చహర్, జయంత్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
DC vs MI: ఢిల్లీ మ్యాచ్కు రోహిత్ శర్మ డౌటే.. కారణం ఇదే!!