
షార్జా: శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 229 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్కతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమవడంతో ఓటమిని చవిచూసింది. చివరలో ఇయాన్ మోర్గాన్ (44; 18 బంతుల్లో ఒక ఫోర్, 5 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (36;16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సలర్లు) రాణించడంతో 210 పరుగులు చేసింది. చివరలో ఢిల్లీ పేసర్ అన్రిచ్ నోర్జే కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ గెలిచింది కానీ.. లేదంటే కోల్కతా ఘన విజయం సాధించేదే. అయితే ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ను కగిసో రబాడ ఔట్ చేసి మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పాడు.
భారీ లక్ష్యఛేదనలో కోల్కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లో సునీల్ నరేన్ (3) ఔట్ అయ్యాడు. సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ వేసిన మూడో ఓవర్లో నితీశ్ రాణా రెండు సిక్సర్లు బాదాడు. శుభ్మన్ గిల్ (22 బంతుల్లో 28) కూడా దూకుడుగా ఆడడంతో పవర్ప్లేలో కోల్కతా 59 పరుగులు చేసింది. అమిత్ మిశ్రా తొమ్మిదో ఓవర్లో గిల్ను ఔట్ చేశాడు. ఆపై హిట్టర్ ఆండ్రీ రసెల్ బ్యాటింగ్కి వచ్చాడు. దీంతో రబాడని ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రంగంలోకి దింపాడు. 138 కిమీ వేగంతో వచ్చినతొలి బంతిని అతి కష్టంమీద రసెల్ అడ్డుకున్నాడు. ఇక రెండో బంతిని రబాడ స్లో డెలివరీ వేయగా.. లాంగాన్ దిశగా రసెల్ బౌండరీ బాదాడు.
రబాడ మూడో బంతిని అద్భుతంగా వేయడంతో పరుగేమీ రాలేదు. నాలుగో బంతిని యార్కర్ రూపంలో సంధించడంతో రసెల్ భారీ సిక్సర్ బాదేశాడు. ఆపై 144.6 కిమీ వేగంతో షార్ట్ పిచ్ బంతిని సంధించగా.. ఫుల్ షాట్తో సిక్సర్ కొట్టేందుకు రసెల్ ప్రయత్నించాడు. అయితే బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకిలేచింది. అటు పక్క ఫీల్డింగ్ చేస్తున్న అన్రిచ్ నోర్జే పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. దాంతో భారీ హిట్టర్ రసెల్ కథ ముగిసింది. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయింది. రబాడ అద్భుత బంతులేసినా.. ఫోర్, సిక్సర్ బాదాడు. ఇంకో రెండు ఓవర్లు రసెల్ ఉండిఉంటే కథ వేరేలా ఉండేది.
ఇక్కడ ఆండ్రి రసెల్ను ఔట్ చేసేందుకు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఓ అద్భుత వ్యూహం పన్నాడు. ఆ వ్యూహం ఢిల్లీకి బాగానే కలిసొచ్చింది. రసెల్ మంచి వేగం ఉన్న పేసర్లను ఆడలేడు. స్పిన్, మీడియం పేస్ అంటే మాత్రం చెలరేగిపోతాడు. ఈ నేపథ్యంలోనే ప్రధాన పేసర్ కాగిసో రబాడతో ఆరంభంలో ఒకే ఒక్క ఓవర్ వేయించాడు అయ్యర్. తర్వాత తొమ్మిదో ఓవర్లో రసెల్ బ్యాటింగ్కు రావడమే ఆలస్యం.. తర్వాతి ఓవర్లో రబాడను రంగంలోకి దించాడు.
'మాకు మంచి ఆరంభం దక్కింది. ఆదిలోనే వికెట్లు దక్కాయి. కీలక సమయంలో రసెల్ వికెట్ తీయడం చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్ 2020 ద్వారా మ్యాచ్ ఎప్పటికీ ముగియదని అర్ధమయింది. మా బ్యాట్స్మన్ అదనంగా 30 పరుగులు చేశారు. లేదంటే మాకు కష్టమయ్యేది. ఇది బ్యాట్స్మన్ విజయం' అని మ్యాచ్ అనంతరం రబాడ తెలిపాడు.