అదనపు బౌలర్ ఉంటే
యూఏఈలోని అబుదాబీ, దుబాయ్ మైదానాలతో పోలిస్తే షార్జా చాలా చిన్నది. బ్యాట్స్మెన్ ఇక్కడ బౌండరీలు సులువుగా బాదగలరు. అందుకే ఇక్కడ మ్యాచ్ అంటే.. ప్రతి జట్టు అదనపు బౌలర్ జట్టులో ఉండేలా చూసుకుంటాయి. కానీ చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం కేదార్ జాదవ్ రూపంలో అదనపు బ్యాట్స్మెన్ను తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో జాదవ్ బ్యాటింగ్కు దిగే అవకాశమే రాలేదు. మరోవైపు చెన్నై జట్టులో అదనపు బౌలర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. జాదవ్ బదులు మరొక పేస్ బౌలర్ను జట్టులోకి తీసుకొని ఉంటే.. చివరి ఓవర్లో బౌలింగ్ చేసేవాడు. చెన్నై సునాయాస విజయం సాధించేది.
మరో 10-20 పరుగులు చేసుంటే
చెన్నై ఆరంభంలోనే సామ్ కరన్ వికెట్ కోల్పోయింది. పవర్ ప్లేలో ఫాఫ్ డుప్లెసిస్, షేన్ వాట్సన్ జోడి నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. దీంతో వేగంగా పరుగులు రాలేదు. 9 ఓవర్లలో చెన్నై 56 రన్స్ మాత్రమే చేసింది. షార్జా లాంటి మైదానంలో ఓవర్కు ఆరు పరుగులే చేయడం చాలా తక్కువ రన్ రేట్. ఇక్కడ ఓవర్కు 10 రన్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇన్నింగ్స్ చివరలో రవీంద్ర జడేజా, అంబటి రాయుడు మెరుపులు మెరిపించడంతో చెన్నై 179 రన్స్ చేయగలిగింది. ఆరంభంలో చెన్నై బ్యాట్స్మన్ మరో 10-20 పరుగులు అదనంగా చేసుంటే.. ఫలితం మరోలా ఉండేది.
మూడుసార్లు గబ్బర్ క్యాచ్ మిస్
180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ కుదురుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారింది. అయితే చెన్నై ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా.. మూడుసార్లు గబ్బర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చేతిలో పడిన క్యాచ్లను సైతం చెన్నై ఫీల్డర్లు వదిలేశారు. దీంతో ధావన్ అజేయ శతకంతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. చెన్నై ఫీల్డర్లు ఒక్క క్యాచ్ను అందుకొని ఉండుంటే.. మ్యాచ్ మలుపు తిరిగేది.
బ్రావోకు గాయం కాకుంటే
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పిన్నర్ రవీంద్ర జడేజా చేతికి బంతిని ఇచ్చి పెద్ద తప్పిదమే చేశాడు. అయితే మహీ ముందు మరో ఆప్షన్ లేదు. ఆఖరి ఓవర్ను డ్వేన్ బ్రావోతో ధోనీ వేయించాలనుకున్నాడు. కానీ గాయం కారణంగా మైదానాన్ని వీడిన బ్రావో మళ్లీ రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జడేజా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. బ్రావోకు గాయం కాకుంటే.. కచ్చితంగా మ్యాచ్ చెన్నై గెలిచేదే.
ఆ విషయంలో ధోనీ తప్పేమీ లేదు.. ఏ కెప్టెన్ అయినా సహనాన్ని కోల్పోతాడు: వార్నర్