
బీసీసీఐ, ఫ్రాంచైజీల సమావేశం:
ఈరోజు (శనివారం) జరిగిన సమావేశంలో నెస్ వాడియా ( కింగ్స్ XI పంజాబ్), షారుఖ్ ఖాన్ (కోల్కతా నైట్రైడర్స్), ఆకాశ్ అంబాని (ముంబై ఇండియన్స్), పార్థ్ జిందాల్ (డిల్లీ క్యాపిటల్స్) సహా ఫ్రాంచైజీల యాజమానులు అందరూ పాల్గొన్నారట. మరోవైపు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాతో ఫ్రాంచైజీల యాజమానులు చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏడు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మినీ ఐపీఎల్కు కూడా అవకాశం ఉందట.

మినీ ఐపీఎల్:
బీసీసీఐ, ఫ్రాంచైజీల సమావేశంలో ఏయే అంశాల గురించి చర్చించారో బోర్డు అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. 'ఈ సమావేశంలో బీసీసీఐ, ఫ్రాంచైజీల యజమానులు ఆరు నుంచి ఏడు అంశాలు కూలంకషంగా చర్చించారు. ఐపీఎల్ను కుదించి మ్యాచులు నిర్వహించడం అందులో ఒకటి' అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. జట్లను రెండు బృందాలుగా విడదీసి అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లతో ప్లేఆఫ్స్ ఆడించడం రెండో అంశం అట. అంటే 8 జట్లు, 2 గ్రూప్లు, 4 ప్లేఆఫ్స్లు అన్నమాట.

రెండు మూడు వేదికల్లోనే అన్ని మ్యాచ్లు:
వారం చివరి రోజుల్లో రెండు మ్యాచులు నిర్వహించడం మూడో అంశం. ఆటగాళ్లు, అధికారులు, టీవీ, మైదానం సిబ్బందిని ఎక్కువ ప్రయాణాలు చేయనీకుండా రెండు మూడు వేదికల్లోనే అన్ని మ్యాచులు నిర్వహించడం నాలుగో అంశం అని సదరు బోర్డు అధికారి పేర్కొన్నారు. తక్కువ కాల వ్యవధిలోనే సీజన్లోని 60 మ్యాచుల్ని ఖాళీ స్టేడియాల్లో ఆడించడం ఐదో అంశం అని చెప్పారు. మిగతా రెండు మూడు అంశాలు చెప్పలేదు. అయితే విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించడం గురించి సమావేశంలో అసలు చర్చకే రాలేదట. ఎందుకంటే కరోనా అన్ని దేశాల్లో ఉంది కాబట్టి.

ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు:
'ఐపీఎల్ను మే 31 వరకు మాత్రమే పొడగించొచ్చని చెప్పారు. అప్పటికే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. మొదటి షెడ్యూలు నుంచి 18 రోజుల తర్వాత టోర్నీ ఆరంభమైతే.. డబుల్ హెడర్స్ పెంచాలా వద్దా అనే విషయమై చర్చించాం. ఐపీఎల్ నిర్వహణకు ముందున్న అవకాశాలపై చర్చించేందుకే ఈ సమావేశం జరిగింది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టోర్నీ నిర్వహణకు అవకాశాలు ఎలా ఉంటాయో అందరం చర్చించాం' అని ఓ ఫ్రాంచైజీ యజమాని తెలిపారు.

షారుక్ ఖాన్ ట్వీట్:
'ఫ్రాంచైజీల యజమానులను కలవడం సంతోషంగా ఉంది. అభిమానులు, ఆటగాళ్లు, యాజమాన్యం, ఆడే నగరాల భద్రత, సంక్షేమం గురించే ఈ సమావేశంలో మాట్లాడం. కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తాం. వైరస్ వ్యాప్తి తగ్గి ఐపీఎల్ కొనసాగాలని నేను కోరుకుంటున్నా. బీసీసీఐతో పాటు ఫ్రాంఛైజీల ఓనర్లు ప్రభుత్వంతో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తర్వాత దీనిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోవాలి' అని బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత:
'బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, స్టార్ అందరం స్పష్టతతో ఉన్నాం. ఆర్థిక నష్టాల గురించి అసస్లు ఆలోచించడమే లేదు. సమావేశంలోనూ ప్రజల భద్రత, సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చాం. ఒక్క రూపాయి గురించైనా ఆలోచించడం సరికాదు. ప్రభుత్వ ఆదేశాలను మేమంతా పాటిస్తాం. ఈ నెలాఖరు వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరనే అనిపిస్తోంది. పరిస్థితి మెరుగవ్వాలని కోరుకుంటున్నాం. విదేశీ ఆటగాళ్లు వస్తారో రారో తెలియదు. ఏప్రిల్ 15 వరకు నిషేధం ఉంది. ఐపీఎల్ జరిగితే గొప్ప' అని కింగ్స్ XI పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నారు.

డబుల్ హెడర్స్పై చర్చించలేదు:
'ప్రజల ఆరోగ్యం, భద్రతే ముఖ్యం. పరిస్థితులు మెరుగైనప్పుడు బీసీసీఐ మళ్లీ సమావేశం నిర్వహిస్తుంది. టోర్నీ నిర్వహణకు గల అవకాశాలను అప్పుడు మరోసారి పరిశీలిస్తాం. ఒకవేళ ఖాళీ స్టేడియాల్లో టోర్నీ నిర్వహిస్తే.. ఆటగాళ్లు, సిబ్బంది, అధికారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబుల్ హెడర్స్పై పూర్తిగా చర్చించలేదు. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెప్పేందుకే ప్రస్తుత సమావేశం' అని డిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ అన్నారు.


Click it and Unblock the Notifications












