
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్లో భాగంగా మరి కొన్ని గంటల్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో డేవిడ్ వార్నర్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య సాగే పోరుపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్కు ఉన్న ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాగాలేదు. ఈ రెండు జట్లు ఇప్పటిదాకా డజనుసార్లు తలపడ్డాయి. ఇందులో తొమ్మిది మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో సన్ రైజర్స్ గెలుపుపై అనుమానాలు ఏర్పడటం సహజమే. ఈ ఐపీఎల్లో ఈ రెండు జట్లూ పోటీ పడటం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా మూడు మ్యాచ్లను ఆడిన జట్లు.. రెండేసి విజయాలను అందుకున్నాయి. తొలి మ్యాచ్ మినహా మిగిలిన రెండింట్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చవి చూసింది.
తొలి రెండు మ్యాచ్లను ఓడిపోయిన సన్ రైజర్స్.. మూడో మ్యాచ్లో గెలుపు రుచి చూసింది. ఈ రెంటికీ ఉన్న తేడా అదే. చివరి మ్యాచ్లో విజయంతో సన్ రైజర్స్ జోరు మీద ఉండగా.. వరుస పరాజయాలతో ధోనీ సేన డీలా పడింది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన చెన్నైపై విజయం సాధించాలంటే మరింత దూకుడును ప్రదర్శించాల్సి ఉంటుందని సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మెంటార్, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించారు.
దూకుడుగా ఆడితే చెన్నైపై విజయం సాధించవచ్చని, అదే సమయంలో మిడిలార్డర్ మరింత రాణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తమకు వస్తోన్న అవకాశాలను వినియోగించుకోవడానికి మిడిలార్డర్ బ్యాట్స్మెన్లకు ఇంతకుమించిన మంచి తరుణం మరొకటి లభించదని చెప్పారు. మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని, ఒత్తిళ్లు సహజమే అయినప్పటికీ.. దాన్ని అధిగమించగలిగితేనే విజయాన్ని అందుకోగలుగుతామని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పారు. టీమ్ మొత్తం యంగ్ స్టర్స్తో నిండి ఉందని చెప్పారు. వారంతా తమకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.