దుబాయ్: ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ తడబాటు కొనసాగుతూనే ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో బ్యాట్స్మన్ వైఫల్యం కారణంగా చెన్నై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రాయల్స్ బౌలర్లు చెలరేగడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాయల్స్ ముందు 126 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రవీంద్ర జడేజా (35: 30 బంతుల్లో 4 ఫోర్లు) టాప్ స్కోరర్. సామ్ కరన్ (22: 25 బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్), ఎంఎస్ ధోనీ (28: 28 బంతుల్లో 2ఫోర్లు) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (1/20), కార్తీక్ త్యాగీ (1/35), శ్రేయాస్ గోపాల్ (1/14), రాహుల్ తెవాటియా (1/18) తలో వికెట్ పడగొట్టారు.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో శామ్ కరన్, ఫాఫ్ డుప్లెసిస్ (10: 9 బంతుల్లో 1x4) చెన్నై ఇన్నింగ్స్ను ఆరంభించారు. మూడో ఓవర్లోనే చెన్నై వికెట్ చేజార్చుకోగా.. అనంతరం వచ్చిన షేన్ వాట్సన్ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఆదుకుంటాడనుకున్న తెలుగు తేజం అంబటి రాయుడు (13) పూర్తిగా నిరాశపరిచారు. ఆపై కరన్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇక రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 56/4తో నిలిచింది.
రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐదో వికెట్కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ ధోనీ.. రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. ఇక ఆఖర్లో కేదార్ జాదవ్ (4 నాటౌట్: 7 బంతుల్లో) దూకుడుగా ఆడలేకపోయాడు. అయితే జడేజా కాస్త బ్యాట్ ఝళిపించడంతో చెన్నై 125 పరుగులు చేయగలిగింది. ఈ సీజన్లో ఇదే అత్యల్ప స్కోర్.
రాజస్తాన్ బౌలింగ్లో దుమ్మురేపింది. జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాటియా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆర్చర్ తన నాలుగు ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి వికెట్ తీయగా.. గోపాల్ నాలుగు ఓవర్లలో వికెట్ తీసి 14 పరుగులు ఇచ్చాడు. ఇక తెవాటియా 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. ముగ్గురూ 12 ఓవర్లలో 52 పరుగులే ఇచ్చారు. దాంతో సీఎస్కే రన్రేట్ దారుణంగా పడిపోయింది. చివరి పది ఓవర్లలో సీఎస్కే చేసింది 69 పరుగులే.
CSK vs RR: ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడిగా రికార్డు!!