
అబుదాబి: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తన అద్భుత కెప్టెన్సీ, మైమరిపించే బ్యాటింగ్ బ్యాటింగ్తో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. మహీని కలవాలని ఎందరో ఫాన్స్ బారికేడ్స్ దాటినా సంఘటనలు కోకొల్లలు. దశాబ్దకాలంలో ఎంతో మంది యువ క్రికెటర్లకు ధోనీ స్ఫూర్తిగా నిలిచాడు. ఇక కెప్టెన్ కూల్ ధోనీని ఆరాధించే క్రికెటర్లలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ కూడా ఒకడు. అబుదాబి వేదికగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో జోస్ బట్లర్ (70 నాటౌట్: 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ) అద్భుత ఇన్నింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుతో పాటు తన క్రికెట్ హీరో ఎంఎస్ ధోనీ నుంచి జోస్ బట్లర్ ఊహించని బహుమతి అందుకున్నాడు. ఐపీఎల్లో ధోనీ ఆడిన 200 మ్యాచ్ జెర్సీని అతడు గిఫ్ట్గా స్వీకరించాడు. అతిపెద్ద అభిమానుల్లో ఒకడైన బట్లర్కు 200 ఐపీఎల్ మ్యాచ్లో ధరించిన ప్రత్యేక జెర్సీని ధోనీ బహుమతిగా ఇచ్చాడు. ఆ జెర్సీతో మురిసిపోతున్న బట్లర్ ఫొటోను రాజస్థాన్ యాజమాన్యం ట్విటర్లో పోస్టు చేసింది. ధోనీ అంటే తనకెంతో అభిమానం అని ఇంగ్లిష్ హిట్టర్ పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఎంఎస్ ధోనీ నుంచి జోస్ బట్లర్ స్వీకరించిన జెర్సీని ఐపీఎల్ కూడా తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. విలువైన బహుమతితో జోస్ బట్లర్ నవ్వుతున్నాడు అని కాప్షన్ రాసుకొచ్చింది. గతంలో టీమిండియా జెర్సీపై సంతకం చేసిన టీషర్ట్ను బట్లర్ కూడా అందుకున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ తన 200వ ఐపీఎల్ మ్యాచ్ జెర్సీని బహుమతిగా ఇవ్వడంపై బట్లర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఆనందంను మాటల్లో చెప్పలేనన్నాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాట్స్మన్ బట్లర్ (70; 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. దీంతో చెన్నై 7 వికెట్ల తేడాతో ఓడింది. మరోవైపు రాజస్థాన్ మాత్రం తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. పది మ్యాచ్లాడి నాలుగో విజయం సాధించిన రాజస్థాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.