
ప్రస్తుతం ఇరు జట్ల పరిస్థితి ఒకేలా ఉంది. ఇకనుంచి చావోరేవో. ఐపీఎల్ 2020లో ఇప్పటికి 9 మ్యాచులు ఆడిన చెన్నై మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. మరోవైపు అన్నే మ్యాచులు ఆడిన రాజస్థాన్ మూడు విజయాలతో పట్టికలో అట్టడుగున ఉంది. దీంతో రెండు జట్లు ఆడాల్సిన ఐదు మ్యాచులలో కచ్చితంగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోగా.. ఓడిన జట్టు మాత్రం ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.
చెన్నై, రాజస్థాన్ ఇప్పటి వరకూ 22 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో 14 మ్యాచులలో చెన్నై విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ కేవలం 8 మ్యాచుల్లో గెలిచింది. ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో స్మిత్ సేనదే పైచేయి. చెన్నై ఆడిన గత ఐదు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి.. మూడింట్లో ఓడింది. మరోవైపు రాజస్థాన్ ఒక మ్యాచ్లో గెలిచి నాలుగింట్లో ఓడింది. అబుదాబి మైదానంలో చెన్నై ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో విజయం సాధించింది. ఐదు మ్యాచ్లాడిన రాజస్థాన్ కూడా నాలుగు విజయాలను అందుకుంది.
తుది జట్లు:
చెన్నై: సామ్ కరన్, షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, దీపక్ చహర్, కేదార్ జాదవ్, శార్దూల్ ఠాకూర్, జోస్ హేజిల్వుడ్, పీయూష్ చావ్లా.
రాజస్థాన్: జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, సంజు శాంసన్, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజపూత్, కార్తిక్ త్యాగి.