
అబుదాబి: డబుల్ హెడ్డర్ మ్యాచ్లలో భాగంగా మరికొద్ది సేపట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, శార్ధూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు. షేన్ వాట్సన్, మిచెల్ శాంట్నర్, కర్ణ శర్మ దూరమయ్యడు. కీలక మ్యాచ్ కోసం పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ కూడా తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. మయాంక్ అగర్వాల్, జేమ్స్ నీశమ్ తుది జట్టులో ఆడుతున్నారు. గ్లెన్ మాక్స్వెల్పై వేటు పడింది.
సీజన్ ఆరంభంలో కేవలం ఒక్క విజయంతో చివరి స్థానంలో నిలిచిన పంజాబ్.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. వరుస మ్యాచ్లు గెలుపొంది ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. అయితే గత మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఒడి మళ్లీ రేసులో వెనకబడింది. దీంతో రాహుల్ టీమ్కు ఈరోజు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్లో గెలవడమే కాదు.. మెరుగైన రన్రేట్ కూడా కావాలి. ఎందుకంటే ఇప్పటికే నాలుగో స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ మెరుగైన రన్రేట్తో ఉంది. పంజాబ్ ఇప్పుడు 12 పాయింట్లతో కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని భావిస్తోంది.
మరోవైపు బెంగళూరు, కోల్కతాలపై ఘన విజయాలు సాధించిన చెన్నై మంచి ఊపులో ఉంది. ప్రస్తుతం చెన్నై ప్లేఆఫ్స్ రేసులో లేకున్నా.. ఘన విజయంతో ఈ సీజన్కు ముగింపు పలకాలని భావిస్తోంది. ప్రస్తుతం చెన్నైపై ఎలాంటి ఒత్తిడి లేదు. దీంతో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. తాను మాత్రమే ఇంటికి పోకుండా.. కోల్కతాను కూడా అదే దారిలో తీసుకెళ్లింది. మరి ఈ రోజు ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
జట్లు:
పంజాబ్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మన్దీప్ సింగ్, జేమ్స్ నీశమ్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ.
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, ఎన్ జగదీషన్, సామ్ కరన్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్, లుంగీ ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్.