సురేష్ రైనా.. వాట్ నెక్స్ట్: చెన్నై సూపర్ కింగ్స్ కటీఫ్?: హర్భజన్తోనూ: ధోనీ సేన నుంచి ఔట్?

చెన్నై: ఊహించిన విషయమే వాస్తవ రూపం దాల్చుతోందా? అందరూ అనుకున్నట్టుగానే- మిస్టర్ ఐపీఎల్.. చెన్నై సూపర్ కింగ్స్కు దూరం కానున్నాడా? ఇకపై చెన్నై టీమ్లో సురేష్ రైనా మెరుపులను చూడలేమా? మళ్లీ జట్టులోకి రావాలంటూ అభిమానులు చేస్తోన్న డిమాండ్ను టీమ్ మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదా?- ఈ ప్రశ్నలన్నింటినీ అవుననే సమాధానమే వస్తోంది. సురేష్ రైనాతో తెగదెంపులు చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఓ నిర్ణయానికి వచ్చిందనే తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని నేషనల్ స్పోర్ట్స్ వెబ్సైట్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

వ్యక్తిగత కారణాల వల్లే..
సురేష్ రైనా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ఆడటానికి టీమ్తో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దాకా వెళ్లాడు. అర్ధాంతరంగా తిరిగొచ్చాడు. టోర్నమెంట్ ఆరంభానికి ముందే సురేష్ రైనా స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. దీనికి గల సరైన కారణం ఏమిటనేది తెలియట్లేదు. `వ్యక్తిగత కారణాలతో మాత్రమే..` అంటూ సురేష్ రైనా ఇన్నాళ్లూ చెబుతూ వచ్చాడు. టీమ్ మేనేజ్మెంట్ కూడా అదే విషయాన్ని ధృవీకరించింది.

అగ్నికి ఆజ్యం పోశాయా..
ఈ వ్యక్తిగత కారణాలే అగ్నికి మరింత ఆజ్యం పోశాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.ఈ కారణాలు కాస్తా- సురేష్ రైనాతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ తెగదెంపులు చేసుకునే స్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. తాను జట్టుతో కలవడానికి రెడీగా ఉన్నాననే సంకేతాలు పంపించినప్పటికీ.. టీమ్ మేనేజ్మెంట్ దాన్ని పరిశీలనలోకి తీసుకున్న సందర్భం లేనే లేదు. పైగా- అతని వ్యక్తిగత కారణాలను తాము గౌరవిస్తున్నామంటూ టీమ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కాశీ విశ్వనాథన్ సైతం స్పష్టం చేశారు. సురేష్ రైనాను జట్టులోకి తీసుకునే అవకాశం లేదనీ తేల్చి చెప్పారు.

అధికారిక వెబ్సైట్ నుంచి పేర్లు తొలగింపు.. కాంట్రాక్టు రద్దు దిశగా..
సురేష్ రైనా, హర్భజన్ సింగ్లతో తమ కాంట్రాక్ట్ను రద్దు చేసుకునే దిశగా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే ఆరంభించిందనీ అంటున్నారు. టోర్నమెంట్ ముగిసిన వెంటనే వారిద్దరినీ తమ టీమ్ నుంచి విడుదల చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనితో వచ్చే ఏడాది ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజీలు వారిని తమ టీమ్లోకి తీసుకునే వెసలుబాటు కల్పించేలా న్యాయపరమైన ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారిద్దరి పేర్లను తమ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించినట్లు సమాచారం.

మహాత్ముడికి నివాళి అర్పిస్తూ..
ఇదిలావుండగా.. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సురేష్ రైనా ఆయనకు నివాళి అర్పించారు. మహాత్ముడి సూక్తులను ఆయన ఉటంకించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రపంచాన్ని మార్చలనే ప్రయత్నం.. ముందుగా నీతోనే ఆరంభం కావాలి.. అనే సూక్తిని సురేష్ రైనా తన ట్విట్టర్లో పొందుపరిచారు. మనలో వచ్చే మార్పుతోనే ప్రపంచం మారుతుందనీ చెప్పారు. మనదేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రాన్ని సాధించిన జాతిపితకు నివాళి అర్పిస్తున్నానని అన్నారు. అదే సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్, చిన్న వయస్సులోనే సర్పంచ్గా ఎన్నికై లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన కరణ్ గిల్హోత్రాలకు సురేష్ రైనా శుభాకాంక్షలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications