IPL 2020: రాజస్థాన్ విజయం.. ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి!!

హైదరాబాద్: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ బెన్ స్టోక్స్ (107; 60 బంతుల్లో 14x4, 3x6) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా.. యువ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ (54; 31 బంతుల్లో 4x4,3x6) అర్థ శతకంతో మెరిశాడు. 44/2తో కష్టాల్లో ఉన్న జట్టును స్టోక్స్, సంజూ బాధ్యతాయుతంగా ఆడి రాజస్థాన్కు ఊహించని విజయాన్ని అందించారు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి చేరుకుంది.

ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్:
తాజా విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోవడమే కాకుండా.. ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఇదే విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరేందుకు ద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందిన చెన్నై.. రెండు పాయింట్లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాజస్థాన్, ముంబై మ్యాచ్ ముగియడానికి ముందు వరకు ధోనీసేనకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు కాస్త సజీవంగా ఉన్నాయి. రాజస్థాన్ విజయం అనంతరం అంతా మారిపోయింది. ప్రస్తుత గణాంకాల పరంగా చూసుకుంటే ఈ సీజన్లో చెన్నై ప్లేఆఫ్స్ చేరే అవకాశమే లేదు.

ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి:
ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో ఆడిన గత పది సీజన్లలో మూడుసార్లు ఛాంపియన్గా నిలిచింది. రెండు సంవత్సరాల నిషేధం అనంతరం కూడా 2018లో టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇక ఐదుసార్లు ఫైనల్ చేరింది. మరో రెండు సార్లు ప్లేఆఫ్స్కు చేరింది. కానీ ఈసారి మాత్రం చెన్నై పూర్తిగా తేలిపోయింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచులలో నాలుగే విజయాలు అందుకుని పట్టికలో చివరి స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచులు గెలిచినా.. ప్లేఆఫ్స్ చేరలేదు. చెన్నై ప్లేఆఫ్స్ చేరకుండా లీగ్ నుంచి నిష్క్రమించడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.

ట్రాక్ రికార్డు అద్భుతం:
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న తరువాత కూడా అద్భుతంగా ఆడింది. నిషేధానికి గురైన రెండు సీజన్లను పక్కన పెడితే.. ప్రతీసారీ తనదైన ముద్రను వేస్తూ వచ్చింది. టోర్నమెంట్పై ఆధిపత్యాన్ని చలాయించింది. ప్రతీసారీ ప్లేఆఫ్లో అడుగు పెట్టింది. 2010, 2011, 2018ల్లో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. 2008, 2012, 2013, 2015, 2019ల్లో రన్నరప్గా నిలిచింది. ఐపీఎల్-2019 వరకూ చెన్నై చిట్టచివరి స్థానం ఏదైనా ఉందంటే.. అది ఫోర్త్ ప్లేస్. కానీ ఈసారి చివరిదైన ఎనిమిదో స్థానం దక్కనుంది.

ధోనీ రిటైర్మెంట్?:
చెన్నై సారథి ఎంఎస్ ధోనీ నిర్ణయాలే జట్టు ఓటమికి కారణమని, ఫామ్లో లేని సీనియర్ ఆటగాళ్లకు పదే పదే అవకాశాలిచ్చి మూల్యం చెల్లించుకున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడంపై కూడా కొందరు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం జట్టులో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని వయసు మీద పడిన వారికి ఉద్వాసన పలుకుతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ త్వరలోనే టీ20 మెగా లీగ్ నుంచి కూడా తప్పుకోనున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications