
ముంబై: ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా.. చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్ గురించే. ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుండి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావం క్రీడారంగంపై పడింది. ఇక కరోనా మన దేశంలోకి కూడా వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 జరుగుతుందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. అయితే ఈ విషయంపై ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ఓ స్పష్టత ఇచ్చారు.
మంగళవారం బ్రిజేష్ పటేల్ ఓ మీడియా సమావేశంలో పాల్గొనగా.. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్కు ఏమైనా ముప్పు ఉందా అని ఓ విలేకరి ప్రశ్నించారు. 'ఇప్పటికి ఎటువంటి ముప్పు లేదు. తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాం. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు ఢోకా ఉండదు. షెడ్యూల్ ప్రకారమే లీగ్ జరుగుతుంది' అని అన్నారు.
మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఈ విషయంపై స్పందించారు. 'భారత్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు కరోనా వైరస్ గురించి చర్చించలేదు' అని అన్నారు. ఈ సంవత్సరం నిర్వహించబోయే ఐపీఎల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన తెలియజేసారు. ఇక మూడు వన్డేల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత్కు వస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 13వ సీజన్ మార్చి 29 నుంచి మే 24 వరకు జరుగుతుంది. టీమిండియాతో దక్షిణాఫ్రికా ఈ 12 నుండి వన్డే సిరీస్ ఆడనుంది. ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లఖ్నవూ వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మార్చి 18న మూడో వన్డే జరుగుతుంది.