
విదేశీ ఆటగాళ్లకు నో ఎంట్రీ
భారత దేశంలో ఇప్పటికే కరోనా బారిన పడ్డవారి సంఖ్య 75కు చేరింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్లకు స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించుకోవాలని బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ, దౌత్య మినహా అన్ని విభాగాల వీసాలను ఏప్రిల్ 15 వరకు నిషేధించింది. దీంతో విదేశీ ఆటగాళ్లు వాణిజ్య వీసాల విభాగంలోకి వస్తారు కాబట్టి వారు ఐపీఎల్ ఆడలేని పరిస్థితి ఏర్పడింది.

బీసీసీఐకి మరో ప్రత్యామ్నాయం లేదు
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో బీసీసీఐ షాక్ తగిలింది. మొదటగా స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ల నిర్వహణకి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఓకే చెప్పారు. అయితే విదేశీ క్రికెటర్లని మాత్రం అనుమతించాలని కోరింది. కానీ.. కేంద్ర ప్రభుత్వం వీసాల సడలింపునకి నో చెప్పింది. దీంతో ఐపీఎల్ని వాయిదా వేయడం, ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు నిర్వహించడం తప్ప మరో ప్రత్యామ్నాయం బీసీసీఐకి లేకుండా పోయింది.

ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్
చేసేదేంలేక ఫ్రాంఛైజీలు అందరూ ఐపీఎల్ను వాయిదా వేయమని బీసీసీఐని కోరాయి. ఫ్రాంఛైజీల కోరిక మేరకు ఐపీఎల్ వాయిదాపై బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. రెండు వారాల పాటు ఐపీఎల్ని వాయిదా వేయనున్నారు. అయితే శనివారం ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్లు కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయి.

వన్డే సిరీస్పైనా కరోనా ప్రభావం
ప్రస్తుతం భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుండగా.. మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం ఈ సిరీస్పైనా పడింది. లక్నో వేదికగా ఆదివారం జరిగే రెండో వన్డే, కోల్కతాలో బుధవారం జరగనున్న మూడో వన్డేకి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు జరగనున్నాయి. వేల సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి వస్తే..? కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకుంది.

వాయిదా వేయడమే సరైన నిర్ణయం
ఒక బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తీసుకుంటే ఐపీఎల్ను వాయిదా వేయడమే సరైన నిర్ణయం అని అభిప్రాయపడ్డాడు. అంతేగాక ఐపీఎల్ సీజన్కు విదేశీ ఆటగాళ్లు కూడా ఏప్రిల్ 14వ తేదీ వరకు అందుబాటులో ఉండరు. ఇదే విషయమై ఐపీఎల్ ప్రాంచైజీలు కూడా లీగ్ను రెండు వారాలు వాయిదా వేయాలని కోరాయి. దీంతో ఏప్రిల్15 నుంచి ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications

