
ముంబై: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలానికి ముహూర్తం ఖరారు అయింది. డిసెంబర్ 19న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం జరగనుంది. చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన ఐపీఎల్ పాలనా కమిటీ (సీజీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి ముంబైలో కాకుండా కోల్కతాలో వేలం నిర్వహించనున్నారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలో జరిగే ఐపీఎల్-13కి ఆయా ఫ్రాంచేజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసే వేలానికి తొలిసారి కోల్కతా ఆతిథ్యమివ్వనుంది.
ఒకవేళ అనివార్య కారణాల వల్ల వేలం వేదిక మార్చాల్సి వస్తే మాత్రం బెంగళూరులో నిర్వహిస్తారు. 'డిసెంబర్ 19న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం నిర్వహిస్తున్నాం. ఐపీఎల్ వేలం ఈసారి కోల్కతాలో జరుగుతుంది' అని ఐపీఎల్ పాలక మండలి తెలిపింది. గత ఏడాది ప్రతి ఫ్రాంచేజీ రూ.82 కోట్లకు ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవడానికి వీలుకల్పించగా... ఈసారి రూ.85 కోట్ల వరకు ఖర్చు చేసుకోవచ్చని పేర్కొంది. గత ఏడాది మిగులు నగదును ఈ ఏడాది ఆటగాళ్లను కొనుగోలు చేసుకొనేందుకు వెచ్చించుకోవచ్చు. 2021లో మాత్రం మళ్లీ ఆటగాళ్లంతా తిరిగి వేలానికి వెళ్లవలసి ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వద్ద అత్యధికంగా రూ.8.2కోట్ల మిగులు నిధులు ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దగ్గర అతి తక్కువగా రూ.1.8 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఐపీఎల్ సీజన్-13 కోసం ఆటగాళ్లను బదలాయించడానికి, విడుదల చేయడానికి లీగ్ ట్రేడింగ్ విండో గడువు నవంబర్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అట్టిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాపై లీగ్లోని జట్లు ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చాయి.
గత ఏడాది ఫ్రాంచేజీల వద్ద మిగులు నిధులు:
1 సన్రైజర్స్ హైదరాబాద్-రూ 5.30 కోట్లు
2) చెన్నై సూపర్ కింగ్స్-రూ 3.2 కోట్లు
3) ఢిల్లీ క్యాపిటల్స్-రూ 8.2 కోట్లు
4) కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రూ 3.7 కోట్లు
5) కోల్కతా నైట్ రైడర్స్-రూ 6.05 కోట్లు
6) ముంబై ఇండియన్స్-రూ 3.55 కోట్లు
7) రాజస్థాన్ రాయల్స్-రూ 7.15 కోట్లు
8) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రూ.1.80 కోట్లు