నవంబర్ 14 వరకు ట్రేడింగ్ విండో గడువు
ఐపీఎల్ సీజన్-13 కోసం ఆటగాళ్లను బదలాయించడానికి, విడుదల చేయడానికి లీగ్ ట్రేడింగ్ విండో గడువు నవంబర్ 14తో ముగియనుంది. ట్రేడింగ్ విండో ఆఖరి తేదీపై ఇప్పటికే ఎనిమిది ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అట్టిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాపై లీగ్లోని జట్టు అన్ని కసరత్తులు చేస్తున్నాయి.
2020 సీజన్ కోసం రూ.85 కోట్లు:
ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఆయా ఫ్రాంఛైజీలు రూ.85 కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. గత ఐపీఎల్ వేలంలో వినియోగించని మొత్తాన్ని కూడా ఫ్రాంఛైజీలు ప్రస్తుత సీజన్లో ఖర్చు చేసుకునేందుకు వీలుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు వద్ద అత్యధికంగా రూ.7.7కోట్ల మిగులు నిధులు ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దగ్గర అతి తక్కువగా రూ.1.8 కోట్లు మాత్రమే ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్కు అశ్విన్?:
ట్రేడింగ్ విండోను ఉపయోగించుకొని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్ర అశ్విన్ను దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భావిస్తోంది. ఈ విషయమై ఇరు జట్లు చర్చలు జరుపుతున్నాయి. అశ్విన్ గత సీజన్-12లో మన్కడింగ్ లాంటివి చేసినా పంజాబ్ను బాగానే నడిపించాడు. దీంతో అతనికి డిమాండ్ పెరిగింది. గత వేలంలో అశ్విన్ను పంజాబ్ రూ.7.6కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అశ్విన్ను జట్టులోకి తీసుకోవడానికి ఢిల్లీ మెంటార్ సౌరవ్ గంగూలీ ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. రాజస్థాన్ ఆటగాడు అంజిక్య రహానేను కూడా తీసుకోవడానికి ఢిల్లీ ఆసక్తిగా ఉండదట.
మిగులు నిధులు:
సన్రైజర్స్ హైదరాబాద్-రూ 5.30 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్-రూ 3.2 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్-రూ 7.7 కోట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రూ 3.7 కోట్లు
కోల్కతా నైట్ రైడర్స్-రూ 6.05 కోట్లు
ముంబై ఇండియన్స్-రూ 3.55 కోట్లు
రాజస్థాన్ రాయల్స్-రూ 7.15 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రూ.1.80 కోట్లు