
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదని ఆ జట్టు బౌలింగ్ మాజీ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. యూఏఈలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కోహ్లీపై తీవ్ర ఒత్తిడి ఉందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఒత్తిడికి లోనైన కోహ్లీ.. సునాయాసంగా వికెట్ సమర్పించుకున్నాడని నెహ్రా పేర్కొన్నాడు. గత మ్యాచులో ఆర్ అశ్విన్ బౌలింగ్లో విరాట్ వెనుదిరిగిన విషయం తెలిసిందే.
తాజాగా స్టార్ స్పోర్ట్స్లో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ... 'యూఏఈలో పరిస్థితులు విరాట్ కోహ్లీకి అంతగా అనుకూలించడం లేదు. దీంతో కోహ్లీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఒత్తిడికి లోనైన విరాట్ వికెట్ సమర్పించుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్లు పెద్దగా వికెట్లు సాధించకపోయినా.. వారు అంత సులువుగా పరుగులు ఇవ్వడం లేదు. ఇక్కడ ఆర్సీబీ కెప్టెన్కోహ్లీకి ఏ విధమైన చాన్స్ ఇవ్వని ఢిల్లీని ప్రత్యేకంగా అభినందించాలి' అని అన్నాడు.
అరోన్ ఫించ్ జట్టులో లేనప్పుడు విరాట్ కోహ్లీ ఓపెనర్గా దిగితేనే మంచిదని భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. 'కనీసం వచ్చే మ్యాచ్ల్లోనైనా ఆరోన్ ఫించ్ లేని పక్షంలో విరాట్ కోహ్లీ ఓపెనర్గా రావాలి. ఆర్సీబీ జట్టులో ఫించ్ లేకపోతే.. కోహ్లీనే ఓపెనర్గా కరెక్ట్' అని నెహ్రా చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ కెరీర్లో నెహ్రా 17 టెస్టుల్లో, 120 వన్డేల్లో, 27 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
రాయల్ చాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆర్సీబీ 153 పరుగుల టార్గెట్ను నిర్దేశించగా.. ఢిల్లీ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్ (54: 41 బంతుల్లో 6ఫోర్లు), అజింక్యా రహానే (60; 46 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్)లు రాణించి విజయానికి బాటలు వేశాడు. అయితే ఆర్సీబీ ఓడినప్పటికీ ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఢిల్లీ తన విజయాన్ని 19 ఓవర్ల వరకూ తీసుకురావడంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరింది.