
రెచ్చిపోతున్న యువకెరటాలు
ఐపీఎల్లో యువకెరటాలు రెచ్చిపోతున్నారు. బ్యాట్తో రెచ్చిపోయి ఓవర్ నైట్ స్టార్గా మారుతున్నారు. పోనీ వారిని ఆయా యాజమాన్యాలను అత్యధిక ధరకు కొనుగోలు చేశాయా అంటే అదీ లేదు. తక్కువ డబ్బులకే కొనుగోలు చేసినప్పటికీ జట్టు యాజమాన్యం వారిపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయలేదు. అలాంటి వారిలో రాహుల్ తెవాటియా, మయాంక్ అగర్వాల్లు ఉన్నారు. అధిక ధరలకు అమ్ముడుపోయిన చాలామంది స్టార్ ప్లేయర్లు అభిమానులను నిరుత్సాహ పరుస్తుండగా తక్కువ ధరకే కొనుగోలు గావించబడ్డ ప్లేయర్లు మాత్రం ఐపీఎల్ మజా ఏంటో చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్యాట్ కమ్మిన్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్ మారిస్, షెల్డన్ కాట్రెల్ ఇప్పటి వరకు పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఇదిలా ఉంటే యువక్రికెటర్లపైనే ఆధారపడ్డ రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం టోర్నీలో అత్యంత మెరుగైన జట్టుపై విజయం సాధించింది. ఇదంతా అన్క్యాప్డ్ లేదా అనుభవం లేని క్రికెటర్ల పుణ్యమే అని చెప్పాలి.

రిషబ్ పంత్ తగిన న్యాయం చేస్తున్నాడా..?
ఇక ఐపీఎల్లో మిగతా ప్రధాన జట్లుగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ లాంటి టీమ్స్ నుంచి స్టార్ ప్లేయర్స్ విజృంభించాల్సి ఉంది. అయితే ఇప్పుడు అత్యధిక ధరకు కొనుగోలు చేయబడిన ప్లేయర్ల జాబితాను ఇస్తున్నాం. వారు ఎంతకు కొనుగోలు చేయబడ్డారు.. వారి ఒక్క రన్ విలువ ఎంతో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఢిల్లీ తరపున ఆడుతున్న రిషబ్ పంత్ రూ.15 కోట్లు పోసి ఆ జట్టు కొనుగోలు చేసింది. రిషబ్ పంత్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది యాజమాన్యం. అయితే ఢిల్లీ జట్టు తరపున పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరును చేయలేకపోయాడు రిషబ్ పంత్. మొత్తం 96 పరుగులు చేసిన రిషబ్ పంత్ ఒక్కో పరుగు విలువ రూ. 3,34,821 గా ఉంది.

కనిపించని రోహిత్ ఫైరింగ్స్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఆ జట్టు యాజమాన్యం రూ.15 కోట్లు వెచ్చించింది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్గా రికార్డు క్రియేట్ చేశాడు శర్మ. ఆ జట్టు యాజమాన్యం కూడా తనపై ఆశలు పెట్టుకుంది. అయితే ఈ సీజన్లో మాత్రం రోహిత్ శర్మ పెర్మార్మెన్స్ అటు సక్సెస్ అని చెప్పలేము ఇటు ఫెయిల్యూర్ అని చెప్పలేనంతగా ఉంది. తాను హాఫ్ సెంచరీ చేసిన ఒకే ఒక మ్యాచ్ ముంబై గెలిచినప్పటికీ... రోహిత్ శర్మ మాత్రం తన స్టాండర్డ్కు తగ్గట్టుగా ఆడలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. లాక్డౌన్ తర్వాత ఫిట్నెస్పై కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఈ టోర్నీలో రోహిత్ శర్మ ఒక్క పరుగు విలువ రూ. 3,21,428గా ఉంది. ఒకవేళ టోర్నీలో విజయం సాధిస్తే కచ్చితంగా తాను తీసుకున్న డబ్బులకు న్యాయం చేకూర్చిన వాడవుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ధోనీ సక్సెస్ అవుతాడా..
మహేంద్ర సింగ్ ధోనీ.. చెన్నై సూపర్కింగ్స్ జట్టు కెప్టెన్.. ధోనీ విలువ కూడా రూ.15 కోట్లు కావడం విశేషం. ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పినప్పటికీ ఆయనకున్న ఫ్యాన్ బేస్ మాత్రం చెక్కు చెదరలేదు.ఐపీఎల్ 2020లో చాలామంది ధోనీ మెరుపుల కోసం వేచిచూస్తున్నారు. వికెట్ల వెనక కీపింగ్ మాత్రం అద్భుతంగా చేస్తున్న ఈ జార్ఖండ్ డైనమైట్... బ్యాట్తో మాత్రం మిరాకిల్స్ క్రియేట్ చేయలేకున్నాడు. గుడ్ ఫినిషర్గా పేరుగాంచిన ధోనీ ఈ సారి మాత్రం తన జట్టుకు ఆశించిన స్థాయిలో విజయాలను అందించడంలో విఫలమయ్యాడు.ఈ సీజన్లో ఇప్పటి వరకు ధోనీ 44 పరుగులు చేశాడు. ఇక ధోనీ చేసిన ప్రతి పరుగు విలువ రూ.7లక్షల 30వేలుగా ఉంది.

అత్యధిక ధరతో కోల్కతా కొనుగోలు
ఇక ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడు ప్యాట్ కమ్మిన్స్. ప్యాట్ కమ్మిన్స్ను కోల్కతా నైట్రైడర్స్ అక్షరాల రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆడిన తొలిగేమ్లో తాను ఔటైన తీరుపై చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు.అయితే విమర్శలకు తన బంతితోనే సమాధానం చెప్పాడు. రెండో మ్యాచ్లో హైదరాబాదు ఆటగాడు బెయిర్స్టోను అవుట్ చేయడమే కాకుండా మంచి స్పెల్ వేయడంతో ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ రెండు వికెట్లు మాత్రమే ఈ సీజన్లో తీశాడు కమ్మిన్స్. ఇక కమిన్స్ తీసే ప్రతి వికెట్ ధర రూ. 1కోటి 66 లక్షలు విలువ చేస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇటు బంతితోను అటు బ్యాట్తోను ఈ ఆల్రౌండర్ చెలరేగిపోతాడనే విశ్వాసం జట్టు వ్యక్తం చేస్తోంది.

నిరాశపరుస్తున్న రన్ మెషీన్ కోహ్లీ
విరాట్ కోహ్లీ..టీమిండియా కెప్టెన్ ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ కప్ గెలవలేకపోయినప్పటికీ తాను మాత్రం అత్యధిక ధర పలికే ఆటగాడిగా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. తన ఆటతీరును చూసిన ఆర్సీబీ యాజమాన్యం మరో రూ.2 కోట్లు వెచ్చించి మొత్తం రూ.17 కోట్లు చెల్లించి విరాట్ను తమ చెంతే ఉంచుకుంది. అయితే తీసుకున్న డబ్బులకు సరైన న్యాయం చేయలేక పోతున్నాడనే భావర వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇక కోహ్లీ ఒక్కో పరుగు విలువ రూ. 20 లక్షల మార్కును టచ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications
