
దుబాయ్: ఐపీఎల్ 2020 ఆరంభానికి ముందు తమ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ చెప్పిన విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే గుర్తుచేసుకున్నాడు. నీకు మూడో స్థానంలో బ్యాటింగ్ బాగుంటుందని రికీ చెప్పాడని, ఆ స్థానంలోనే బ్యాటింగ్ చేయమని పట్టుబట్టారని పేర్కొన్నాడు. క్రికెట్ అంటేనే ఫన్నీగా ఉంటుందని, ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం కష్టమన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించడంతో టాప్-2కు చేరింది.
మ్యాచ్ అనంతరం అజింక్యా రహానే మాట్లాడుతూ... 'నీకు మూడో స్థానంలో బ్యాటింగ్ బాగుంటుందని రికీ పాంటింగ్ చెప్పాడు. ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడం నీకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లో మూడో స్థానంలో రాణించడం సంతోషంగా ఉంది. కానీ విజయానికి చేరువగా వచ్చిన తర్వాత నేను ఔట్ కావడం నిరాశ కల్గించింది. చివరి వరకు క్రీజులోఉండి నేను గేమ్ను ఫినిష్ చేయాలనుకున్నా' అని తెలిపాడు.
'ఒక్కోసారి మ్యాచ్ ఆకస్మికంగా ఛేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ టెన్షన్ కాస్త నాలో ఉంది. కానీ మ్యాచ్లో విజయం సాధించి ప్లేఆఫ్స్కు చేరడమే కాకుండా రెండో స్థానాన్ని దక్కించుకోవడం శుభపరిణామం. మా ఆటగాళ్లు అందరూ బాగా ఆడారు. ముఖ్యంగా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు' అని రహానే తెలిపాడు. ఇక సరైన సమయంలో రహానే ఫామ్లోకి వచ్చాడంటూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించడమే కాకుండా స్టైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్, డబుల్స్ కూడా తీశాడన్నాడు. తన అనుభవంతో మంచి ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు.
రాయల్ చాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆర్సీబీ 153 పరుగుల టార్గెట్ను నిర్దేశించగా.. ఢిల్లీ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్ (54: 41 బంతుల్లో 6ఫోర్లు), అజింక్యా రహానే (60; 46 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్)లు రాణించి విజయానికి బాటలు వేశారు. అయితే ఆర్సీబీ ఓడినప్పటికీ ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఢిల్లీ తన విజయాన్ని 19 ఓవర్ల వరకూ తీసుకురావడంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరింది.