
దుబాయ్: క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020కి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా లీగ్ ప్రారంభం కానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో నెల రోజుల ముందుగానే అన్ని జట్లు అక్కడికి చేరుకుంటున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ గురువారం దుబాయ్ చేరుకోగా.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈ గడ్డపై అడుగుపెట్టాయి. మరోవైపు విదేశాల నుండి ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బృందం శుక్రవారం యూఏఈ చేరుకుంది. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్, క్రిస్ మోరీస్ ఆర్సీబీ జట్టులో చేరారు. ప్రత్యేక విమానంలో ముగ్గురు దుబాయ్ వచ్చారు. సఫారీ క్రికెటర్లు ముగ్గురు సహచర ఆటగాళ్లతో మాటామాటా కలిపారు. ముఖ్యంగా ఏబీడీ అక్కడ సందడి వాతావరణం నెలకొల్పాడు. చాలా రోజుల తర్వాత అందరూ ఒకచోట కలవడంతో సరదాగా మాట్లాడుకున్నారు.
శనివారం ఈ ముగ్గురు సఫారీ ప్లేయర్స్ టీమ్ హోటల్కు చేరుకున్నప్పుడు తీసిన వీడియోను ఆర్సీబీ ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డివిలియర్స్తో విరాట్ కోహ్లీకి చక్కటి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు, కోచింగ్ సహాయ సిబ్బంది 6 రోజుల పాటు హోటల్ గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ 6 రోజుల్లో వారికి 3 సార్లు వైరస్ పరీక్షలు చేసి.. నెగటివ్ వచ్చిన వారిని బయో బబుల్ వాతావరణంలోకి అనుమతిస్తారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్వాట్సన్ కూడా దుబాయ్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడిని 7 రోజుల పాటు క్వారెంటైన్లో ఉండమని చెప్పారు. దీంతో అతడికి కేటాయించిన హోటల్ గదికే పరిమితమయ్యాడు. తన గది నుంచే ఒక వీడియో తీసి మాట్లాడిన అతడు.. తానేం చేయబోతున్నాడనే విషయాలను చెప్పాడు. వాట్సన్ మాట్లాడుతూ... 'ప్రతీ ఒక్కరికి హాయ్. నేనిప్పుడే దుబాయ్కి చేరుకున్నా. ప్రస్తుతం హోటల్లో ఉన్నాను. 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. కొన్ని కరోనా పరీక్షలు కూడా చేయించుకోవాలి' అని పేర్కొన్నాడు.