
దుబాయ్: ఐపీఎల్ 2020లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 13వ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లాడిన ముంబై ఐదు మ్యాచ్ల్లో గెలుపొందింది. చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్లలో (పంజాబ్,హైదరాబాద్, రాజస్థాన్, ఢిల్లీ) విజయాలు అందుకుంది. దాంతో పాయింట్ల పట్టికలో రోహిత్ సేన 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అయితే మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిసున్నాడు. అంతేకాదు సూర్యకుమారే ముంబై తరఫున టాప్ స్కోరర్ కూడా.
సూర్యకుమార్ యాదవ్ ఆడిన 7 మ్యాచ్ల్లో 233 రన్స్ చేశాడు. 38.83 యావరేజ్, 155కిపైగా స్ట్రైక్ రేట్ ఉంది. రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లోనే 53 రన్స్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (5) విఫలమయిన సమయంలో క్వింటన్ డికాక్ అండతో ముంబైని విజయానికి చేరువచేశాడు. ఆపై కీరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా మిగతాపని పూర్తిచేశారు. ఐపీఎల్ 2020లో సూర్యకుమార్ ప్రతి మ్యాచులో కనీస ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతడి ఆటకు మాజీలుఫిదా అవుతున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
తాజాగా అకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ... 'ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడాడు. అతడిని గేమ్ ఛాంజర్గా భావిస్తున్నాను. సూర్యకుమార్ బ్యాటింగ్ చేస్తున్న తీరు బాగుంది. అతడి ఆటకు ఫిదా అయ్యా. సూర్యకుమార్ కవర్స్ దిశగా ఆడుతున్న షాట్లు.. ముఖ్యంగా ఫ్లిక్స్, కట్ షాట్లు అద్భుతం' అని అన్నాడు.
'కాగిసో రబాడ బౌలింగ్లో ఫ్లిక్ షాట్తో సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టిన తీరు అమోఘం. ఆ షాట్ను చూసి నేను నమ్మలేకపోయాను. అంత బాగా ఆడాడు. సూర్యకుమార్ కచ్చితంగా టీమిండియా తరఫున ఆడతాడు. 2020 చివరిలోగా సూర్యకుమార్ భారత జట్టుకు ఎంపికవవుతాడు' అని ఆకాశ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే మ్యాచులలో కూడా సూర్యకుమార్ ఇలాగే ఆడాలని అతడు కోరుకున్నాడు.
కోల్కతా నైట్రైడర్స్ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్ ఛేదనలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుపు అంచుల వరకూ వచ్చి పరాజయం పాలైంది. ఈ ఓటమిపై కూడా ఆకాశ్ చోప్రా మరో వీడియోలో స్పదించాడు. 'రాహుల్ టీమ్ కోల్కతాను ఓ మోస్తారు స్కోరుకే పరిమితం చేసింది. అది ఛేదించదగిన స్కోర్. అలానే పంజాబ్ ఆడిన తీరు ఊహకు కూడా అందలేదు. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ తొలి వికెట్కు 115 పరుగులు జోడించాక విజయం వైపు నడవాలి. అలా జరగలేదు. ఆ జట్టు ఆడిన తీరు నన్ను ఆశ్చర్యం కలిగించింది. పూరన్ పెవిలియన్ చేరాక అనుభవం లేని ప్రభు సిమ్రన్ను బరిలోకి దింపారు. మన్దీప్, మాక్స్వెల్ లాంటి అనుభవజ్ఞులను పంపలేదు. సిమ్రన్ కుదురుకునేలోపే రన్రేట్ ఆమాంతం పెరిగిపోయింది. ఆ సమయంలోనూ పంజాబ్ ఓడిపోదు. అయినా ఆ జట్టు ఓటమిపాలైంది. చాలా నిరాశ చెందా' అని పేర్కొన్నాడు.