
సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఖలీల్ అహ్మద్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా ఆటపట్టించాడు. శనివారం ఐపీఎల్ 12వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది. మొదటగా పార్థివ్ పటేల్ (0) పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు.
ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో విరాట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చాడు. విరాట్ అవ్వడంతో ఖలీల్ అహ్మద్ తన చేతులతో విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీని ఖలీల్ కలిసాడు. ఆ సమయంలో కోహ్లీ కూడా అచ్చం ఖలీల్ లాగానే చేతులు ఊపుతూ సరదాగా ఆటపట్టించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. దీనికి సంబందించిన వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.
చిన్నస్వామి మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హైదరాబాద్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 4 వికెట్లు నష్టపోయి ఛేదించింది. వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ హెట్మైయిర్ (75; 47 బంతుల్లో 4×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. గురుకీరత్ సింగ్ మన్ (65; 48 బంతుల్లో 8×4, 1×6) అర్ధ శతకంతో మెరిశాడు.