

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో తన అరంగేట్ర మ్యాచ్లోనే సంచలన ప్రదర్శన చేశాడు ముంబై ఇండియన్స్ ఆటగాడు అల్జారి జోసెఫ్. జోసెఫ్(6/12)తో రాణించడంతో శనివారం ఉప్పల్లో సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ముంబై నిర్దేశించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ 17.4 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. దీంతో సన్రైజర్స్ హాట్రిక్ విజయాలకు జోసెఫ్ బ్రేక్ వేశాడు. సన్రైజర్స్ చేధనలో ఏ ఒక్కరూ కూడా రాణించలేదు. తొలి బంతికే ఓపెనర్ డేవిడ్ వార్నర్(15) ఔట్ చేశాడు.
ఆ తర్వాత జోసెఫ్ వరుస ఓవర్లలో విజయ్ శంకర్(5), హుడా(20), రషీద్ ఖాన్(0), భువనేశ్వర్(2), కౌల్(0)లు పెవిలియన్కు చేర్చాడు. మరో యువ స్పిన్నర్ రాహుల్ చహర్(2/21) కూడా రాణించడంతో ముంబై అలవోక విజయాన్ని అందుకుంది.
136 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు రోహిత్శర్మ(11), క్వింటన్ డికాక్ (19)లు తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరారు. మహ్మద్ నబీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ 4వ బంతికి రోహిత్ శర్మ(11) దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత సందీప్ వేసిన 5వ ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్(7) ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా(6), హార్థిక్ పాండ్యా(14), రాహుల్ చాహర్(10)లు స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేరారు. చివర్లో పొలార్డ్ 26 బంతుల్లో 46 (2 ఫోర్లు, 4 సిక్సులు)లో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది.
సన్రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ రెండు, భువీ, సందీప్శర్మ, నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగింది.
గత మ్యాచ్లో ఆడిన యువరాజ్ సింగ్, లసిత్ మలింగల స్థానంలో అల్జారి జోసెఫ్, ఇషాన్ కిషన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. కాగా, సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో విజయం సాధించాలని సన్రైజర్స్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండింట ఓడి... రెండింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.