2008లో
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలోని పలు క్రికెట్ స్టేడియాల్లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మ్యాచ్లను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్ 2019 సీజన్ను మళ్లీ విదేశీ గడ్డపై నిర్వహించే యోచనలో ఉన్నారు. ఇదే గనుక జరిగితే ప్రత్యక్షంగా మ్యాచ్లను వీక్షించే అవకాశాన్ని క్రికెట్ అభిమానులు కోల్పోనున్నారు.
రాహుల్ జోహ్రీ నాయకత్వంలో
ఇటీవల బీసీసీఐ బోర్డు సభ్యులకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన సమావేశమే ఈ ఊహాగానాలకు తావిస్తోంది. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ నాయకత్వంలోని బోర్డు అధికారులు కొందరు ఇటీవలే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండటంతో భద్రత దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్ల వేదికలను విదేశాలకు తరలించాలని ప్రభుత్వం సూచించినట్టు జోహ్రీ తెలిపారు.
ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై
అయితే ఇప్పటివరకూ విదేశాల్లో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లు కూడా ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లకు అడ్డంకిగా మారాయి. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జూలై 14 వరకూ వన్డే ప్రపంచకప్ జరగనుంది.
వరల్డ్కప్ టోర్నీకి 15 రోజులు ముందే
జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఆ వరల్డ్కప్ టోర్నీకి 15 రోజులు ముందే ఐపీఎల్ 2019 సీజన్ ముగియడం తప్పనిసరి. అంటే.. ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ ప్రారంభమై మే మూడో వారంలోపు ముగియాలి. ప్రతి ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లు ఏప్రిల్ మొదటివారంలో ఆరంభమై మే చివరి వారంలో ముగియడం సంపద్రాయం.
మే చివరి వారం వరకూ ఐపీఎల్ జరిగే అవకాశం
కానీ, ఈసారి అలా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం మే చివరి వారం వరకూ ఐపీఎల్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్లు జరిగే సమయంలోనే ఎన్నికలు కూడా జరగనుండటంతో.. భద్రతా ఏర్పాట్లు చేయలేమని ఇప్పటికే నిర్వాహకులకి అధికారులు తేల్చి చెప్పేశారు.
భారత్ వెలుపల మ్యాచ్లు నిర్వహిస్తే?
టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలు.. భారత్ వెలుపల మ్యాచ్లు నిర్వహిస్తే? భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఆ నిర్ణయంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న బోర్డు.. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్లను విదేశాలకు తరలించాల్సి వస్తే మాత్రం అందుకు అనుగుణమైన మూడు విదేశీ వేదికలైన దక్షిణాఫ్రికా, యూఏఈ, ఇంగ్లాండ్లో నిర్వహించే యోచనలో ఉంది.