హైదరాబాద్: వచ్చే ఏడాది తమ దేశంలో ఐపీఎల్ నిర్వహించేందుకు దక్షిణాఫ్రికా ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. ఐపీఎల్-2019 సీజన్ను నిర్వహించడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. వచ్చే ఏడాది భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఐపీఎల్ టోర్నీని వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తారు.
మరో కొద్ది నెలల్లో ఆరంభం కానున్న ఐపీఎల్-12 సీజన్కు సన్నాహాలు మొదలైయ్యాయి. 2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ వచ్చే ఏడాది మే 30న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నమెంట్ కంటే ముందే ఐపీఎల్ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. నిర్వాహకులు భావిస్తే.. ఆ టోర్నీని నిర్వహించేందుకు తాము సిద్ధమని దక్షిణాఫ్రికా తెలిపింది.
'ఐపీఎల్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని అనుకుని లీగ్ నిర్వాహకులు మమ్మల్ని అడిగితే మా సమాధానం ఓకే అనే చెబుతాం. ఇందులో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు' అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఐపీఎల్కు, ఏదైనా క్రికెట్ టోర్నీ మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మే నెల తొలి రెండు వారాల్లోపు ఐపీఎల్ను నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ 2019, మార్చి 29న ఐపీఎల్-12 సీజన్ను ఆరంభించాలని సన్నాహాలు చేస్తోంది.
మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల షెడ్యూల్ను బట్టి ఐపీఎల్ తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలాగే అంతకుముందు గతంలోనూ ఓసారి సాధారణ ఎన్నికల సమయంలో కూడా కొన్ని ఐపీఎల్ మ్యాచ్లను 19 రోజుల పాటు యూఏఈ వేదికగా నిర్వహించారు.