ఆర్సీబీ వరుస ఓటములు
ఈ వరుస ఓటములను తట్టుకోలేని కొందరు ఆర్సీబీ అభిమానులు కెప్టెన్గా విరాట్ కోహ్లీని మార్చాలంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. తాజాగా ఓ ఆర్సీబీ అభిమాని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సిమన్ డౌల్ని చంపుతానంటూ హెచ్చరించాడు. టోర్నీలో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
కామెంటేటర్ సిమన్ డౌల్కు వార్నింగ్
ఈ మ్యాచ్కి కామెంటేటర్గా ఉన్న సిమన్ డౌల్ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటతీరుపై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో తట్టుకోలేకపోయిన ఓ అభిమాని ఆర్సీబీని విమర్శిస్తే చంపుతానంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. "ఇతరుల గురించి మాట అనే ముందు ఆలోచించు. ఆర్సీబీ వారి పరాజాయాన్ని అంగీకరించింది. మళ్లీ ఎప్పుడూ ఆర్సీబీని కామెంట్ చేయకు. కాదని విమర్శిస్తే చచ్చిపోతావ్" అని ఆ పోస్టులో రాసుకొచ్చాడు.
ట్విట్టర్లో సిమన్ డౌల్ సమాధానం ఇలా
ఆర్సీబీ అభిమాని పోస్ట్పై సిమన్ డౌల్ తనదైన శైలిలో స్పందించాడు. ఈ పోస్టుకు సంబంధించి స్క్రీన్ షాట్ను ట్విటర్లో షేర్ చేస్తూ "ధర్మేశ్ నాపట్ల సంతోషంగా లేడు. నేను ఏం అన్నానో గుర్తు లేదు. ఇది ఒక ఆట మాత్రమే. చిల్ ఔట్ బ్రో" అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే, ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ, ఆ ట్వీట్ను సిమన్ డౌల్ తొలగించాడు.