సొంత మైదానంలో మంచి ముగింపు:
మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ... 'సొంత మైదానంలో మంచి ముగింపు లభించింది. మా జట్టు ఆటగాళ్లు అందరూ బాగా రాణించారు. లివింగ్ స్టోన్, శాంసన్ల ఇన్నింగ్స్ చాలా కీలకం. ఇద్దరూ ఎటువంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేసారు. శాంసన్ ఇన్నింగ్స్ ముగించిన విధానం బాగుంది. జట్టుగా ఆడి విజయం సాధించాం' అని స్మిత్ పేర్కొన్నారు.
జోరు కొనసాగిస్తాం:
'మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశం ఉంది. చివరి రెండు మ్యాచుల్లో మా జట్టులో మార్పు కనిపించింది. మిగిలిన మ్యాచుల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తాం. బెంగళూరులో చివరి మ్యాచ్ ఆడనున్నాను. ఆ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధిస్తాం. అనంతరం డిల్లీలోనూ మా జట్టు గెలుస్తుందనే నమ్మకం ఉంది. నా భుజం ప్రస్తుతం బాగానే ఉంది' అని స్మిత్ చెప్పుకొచ్చారు.
ఆరో స్థానానికి రాజస్థాన్:
మొదటగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. మనీశ్ పాండే (36 బంతుల్లో 61; 9 ఫోర్లు) అర్ధ శతకం చేసాడు. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ ఆరోన్, థామస్, శ్రేయస్ గోపాల్, ఉనాద్కట్ తలా 2 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలిచింది. శాంసన్ (32 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), లివింగ్ స్టోన్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. తాజా విజయంతో రాజస్థాన్ ఏడో స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకుంది.