
హైదరాబాద్: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ పార్థివ్ పటేల్(67) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్కు 159 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్లోనూ బెంగళూరుకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్లు ఇన్నింగ్స్ను ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 49 పరుగుల వద్ద కోహ్లీ(23) తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. కోహ్లీ దూకుడుగా ఆడే సమయంలో శ్రేయస్ గోపాల్ బౌలింగ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత మరో 22 పరుగుల వ్యవధిలో ఏబీ డివిలియర్స్(13) కూడా పెవిలియన్కు చేరాడు.
ఆ తర్వాత హెట్మెయిర్(1) కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్కు చేరాడు. దాంతో 73 పరుగులకే ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ జట్టులో ఎంతో కీలకమైన ఈ మూడు వికెట్లను శ్రేయాస్ గోపాలే తీయడం విశేషం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోయినిస్తో కలిసి పార్థివ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు.
వీరిద్దరూ నాలుగో వికెట్కి 53 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టు స్కోరు 126 పరుగుల వద్ద పార్థివ్ నాలుగో వికెట్గా ఔటయ్యాడు. చివర్లో స్టోయినిస్(31 నాటౌట్), మొయిన్ అలీ(18 నాటౌట్) దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.