

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా సోమవారం రాజస్థాన్ రాయల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజ్యింకె రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
బాల్ టాంపరింగ్ ఉదంతంలో గత సీజన్ మొత్తానికి దూరమైన రాజస్థాన్ మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్ (ఆస్ట్రేలియా) ఈ మ్యాచ్తో మళ్లీ టోర్నీలోకి పునరాగమనం చేశాడు. దీంతో అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయి. గత ఐపీఎల్లో లీగ్ దశలో నాల్గో స్థానంలో నిలిచి నాకౌట్కు చేరుకున్న రాజస్తాన్.. కోల్కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లోఓటమి పాలైంది.
ఇక, ఆరంభంలో అదరగొట్టిన కింగ్స్ పంజాబ్.. ఆపై వరుస వైఫల్యాలు చవిచూసింది. వరుసగా ఐదు మ్యాచ్లో ఓటమి చెందడంతో ఆ జట్టు ఏడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. కాగా, ఈసారి 13 మంది కొత్త ఆటగాళ్లతో ఐపీఎల్కు సిద్ధమైన కింగ్స్ పంజాబ్ గతేడాది చేసిన పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలని భావిస్తోంది.
ఇక, ఐపీఎల్లో ఇప్పటివరకు ముగిసిన పదకొండు సీజన్లలో ఇరు జట్ల మధ్య రికార్డులను ఒక్కసారి పరిశీలిస్తే... ఇప్పటివరకు 17సార్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ 10 మ్యాచ్ల్లో గెలుపొందగా.. పంజాబ్ 7 మ్యాచ్ల్లో విజయాన్ని అందుకుంది. 2013 ఐపీఎల్ సీజన్ మ్యాచ్ ఫిక్సింగ్ నేపథ్యంలో.. రాజస్థాన్ రాయల్స్పై రెండేళ్ల నిషేధానికి గురవడంతో 2016, 2017 ఐపీఎల్ సీజన్లకి ఆ జట్టు దూరమైన సంగతి తెలిసిందే.
జట్ల వివరాలు:
రాజస్థాన్ రాయల్స్: రహానే, బట్లర్, స్మిత్, స్టోక్స్, శాంసన్, గౌతమ్, గోపాల్, త్రిపాఠి, ఆర్చర్, ఉనాద్కత్, కులకర్ణి
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఖాన్, పూరన్, సింగ్, శామ్ కుర్రన్, షమీ, రెహ్మాన్, రాజ్పుత్