ఓపెనర్ల జోరు:
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షాలు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రెండో ఓవర్ వేసిన కులకర్ణి బౌలింగ్లో 6, 4 బాదిన ధావన్.. అదే ఊపును కొనసాగించాడు. మరోవైపు పృథ్వీ షా కూడా ధావన్కు మంచి సహకారం అందించాడు. ధావన్ బౌండరీలు, సిక్సర్లు బాదుతూ 25 బంతుల్లోనే 50 (7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం చేసాడు. అయితే అదే ఊపులో నిష్క్రమించాడు.
పంత్ విధ్వంసం:
ధావన్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (4) త్వరగానే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో పృథ్వీ షాకి హార్డ్ హిట్టర్ రిషభ్ పంత్ జతకలవడంతో బోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా పంత్ బౌండరీలతో విరుచుకుపడి 26 బంతుల్లో అర్ధ శతకం చేసాడు. మూడో వికెట్కు 84 పరుగులు జోడించాక పృథ్వీ అవుట్ అయ్యాడు. రూథర్ఫర్డ్ (11) ఎక్కువసేపు క్రీజులో నిలువకపోయినా.. రిషభ్ పంత్ చివరివరకు క్రిజులో ఉండి మ్యాచ్ ముగించాడు. రాజస్థాన్ బౌలర్లలో కులకర్ణి, పరాగ్ చెరో వికెట్ తీశారు.
రహానే సెంచరీ:
మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ సామ్సన్ (0) ఒక్క బంతి ఆడకుండానే రనౌటయ్యాడు. అనంతరం క్రిజులోకి వచ్చిన కెప్టెన్ స్మిత్.. రహానేకు జతకలిశాడు. ఈ జోడి అడపాదడపా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ ను నడిపించారు. రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం బౌండరీలు బాదుతూ.. 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు స్మిత్ కూడా ధాటిగా ఆడుతూ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన స్టోక్స్ (8), టర్నర్ (0), పరాగ్ (4)లు విఫలమయ్యారు. చివరలో స్టువర్ట్ బిన్నీ (19; 2 ఫోర్లు) కూడా బ్యాట్ జులిపించాడు. ఇక రహానే 58 బంతుల్లో సెంచరీ సాధించి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.