

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జట్లకు చెందిన ఆటగాళ్లు జట్టుతో కలిసి ట్రైనింగ్ క్యాంపులకు హాజరవుతున్నారు. తాజాగా మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ట్రైనింగ్ క్యాంపుకి అనుకోని అతిథి వచ్చాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
దీంతో ఆటగాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. భారత పుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి చిన్నస్వామి స్డేడియానికి వచ్చాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని ఆటగాళ్లకు కోహ్లీనే స్వయంగా సునీల్ చెత్రిని పరిచయం చేశాడు.
ఈ సందర్భంగా ఈ రోజంతా తన స్నేహితుడు తమతోనే గడుపుతాడని అతనికి సహకరించాల్సిందిగా కోహ్లీ కోరాడు. ఈ క్రమంలో పలువురు యువ క్రికెటర్లు సునీల్ ఛెత్రి ఫిట్నెస్ గురించి వాకబు చేశారు. ఈ విషయాన్ని కోహ్లీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.
"కెప్టెన్ సునీల్ చెత్రితో ట్రైనింగ్లో సరదాగా గడిచిపోయింది" అంటూ కోహ్లీ కామెంట్ కూడా పెట్టాడు. సునీల్ ఛెత్రి నాయకత్వంలోని బెంగళూరు ఎఫ్సీ జట్టు ఇటీవలే ఐఎస్ఎల్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ఎఫ్సీ గోవా జట్టుపై 1-0తో విజయం సాధించింది. బెంగళూరు ఎఫ్సికి ఇది తొలి ఐఎస్ఎల్ టైటిల్ కావడం విశేషం.
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఎఫ్సీ గోవా జట్టు సహాయజమాని కోహ్లీనే. కాగా, మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2019 సీజన్ తొలి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది.