
ఈ ఐపీఎల్ సీజన్-12లో ఇప్పుడిప్పుడే వరుస విజయాలతో గాడిలో పడుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకి షాక్ తగిలింది. వెస్టిండీస్, ముంబై స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ గాయం కారణంగా టోర్నీలో మిగతా మ్యాచ్లకు దూరమయ్యాడు. ముంబై బౌలర్లు మలింగా, బెండ్రాఫ్, బుమ్రాలతో కలిసి జోసెఫ్ మంచి ప్రదర్శనే చేసాడు. ఇప్పుడు ఈ పేసర్ దూరం కావడంతో ముంబై యాజమాన్యం ఆందోళనలో ఉంది.
అల్జారీ జోసెఫ్ శనివారం వాంఖడే స్టేడియంలో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. బౌండ్రీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జోసెఫ్.. బంతిని ఆపే క్రమంలో కిందపడ్డాడు. భుజం ఎముకకు తీవ్ర గాయం అవడంతో టోర్నీలోని మిగతా మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఈ మేరకు ముంబై యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే గాయం కారణంగా ఐపీఎల్-12 నుండి తప్పుకోవడంతో అల్జారీ జోసెఫ్ ముంబై జట్టులోకి వచ్చాడు. హైదరాబాద్ జట్టుతో ఆడిన మొదట మ్యాచ్లోనే జోసెఫ్ సంచల ప్రదర్శన చేసాడు. కేవలం 12 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీసాడు. దీంతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. అయితే రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం తేలిపోయాడు. మూడు ఓవర్లలో 53 పరుగులు ఇచ్చాడు. అనంతరం గాయపడి మైదానాన్ని వీడాడు. జోసెఫ్ స్థానంలో ఎవరు జట్టులోకి వస్తారో మాత్రం ముంబై యాజమాన్యం తెలపలేదు.