

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మ్యాచ్ గెలిచినా.. ఓడినా కూల్, సింపుల్గా ఉంటాడు. ఇదే ఆయనను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఇప్పుడు ధోనీ ఏం చేసినా అది వెంటనే వైరల్ అవుతోంది. బ్యాటింగ్, కీపింగ్ విన్యాసాలు.. కూతురు జీవాతో చేసే అల్లరి, అభిమానులతో చేసే సందడి ఇలా ఏం చేసినా ధోనీకే చెల్లింది. అయితే ధోనీ ఇంత చేసినా సింప్లిసిటీగానే ఉంటాడు. అదే మరోసారి నిరూపితమైంది.
చెన్నై వేదికగా మంగళవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది. లీగ్లో భాగంగా ఆ తర్వాతి మ్యాచ్ను గురువారం జైపూర్ సవాయ్ మాన్సింగ్ మైదానంలో రాజస్థాన్తో ఆడాల్సిఉంది. ఆ మ్యాచుకు కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉండడంతో చెన్నై జట్టు ఆటగాళ్లు అందరూ చెన్నైలోని విమానాశ్రయానికి చేరుకున్నారు.
కోల్కతాతో మ్యాచ్ అనంతరం తగినంత విశ్రాంతి లేకపోవడంతో.. ధోని విమానాశ్రయంలోని నేలపైనే తన లగేజ్ బ్యాగ్ పెట్టుకుని కాసేపు కునుకు తీశాడు. మరోవైపు ధోనీ భార్య సాక్షి కూడా కునుకు తీయగా.. చెన్నై జట్టు సభ్యులు ఎదురుగా కూర్చొని ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ధోని తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసాడు. చెన్నై జట్టు కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.