మద్రాస్ రెజిమెంట్ బ్యాండ్ ప్రదర్శన
భారత సైనిక దళాల సన్మాన కార్యక్రమానికి ముందు చెన్నైలో ఉండే మద్రాస్ రెజిమెంట్ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంది. భారత సైనిక దళాల సన్మాన కార్యక్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సాయుధ బలగాల సంక్షేమ నిధికి రూ.20 కోట్లు విరాళం ఇవ్వనుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని రద్దు చేసి దానికయ్యే ఖర్చును సైన్యానికి ఇవ్వాలని అంతకముందే బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
సైనిక సంక్షేమనిధికి బీసీసీఐ రూ. 20 కోట్లు
గతేడాది ఐపీఎల్ ప్రారంభోత్సవ బడ్జెట్ సుమారు రూ. 15 కోట్లు. దానికి మరో రూ. 5 కోట్లు కలిపి ఇవ్వాలని బీసీసీఐ ప్రతిపాదించింది. మార్చి 23న జరిగే ఐపీఎల్-12 ప్రారంభోత్సవానికి త్రివి ధ (ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ) దళాలలోని అత్యున్నత స్థాయి అధికారులను ఆహ్వానించి.. వారికి ఈ విరాళాన్ని అందజేయనుంది.
|
15-20 నిమిషాల పాటు మిలిటరీ బ్యాండ్ల ప్రదర్శన
"సుమారు 15-20 నిమిషాల పాటు మిలిటరీ బ్యాండ్ల కార్యక్రమం ఉంటుంది. సన్మాన కార్యక్రమానికి ముందు బ్యాండ్ ప్రదర్శన జరుగుతుంది. దీంతో టాస్ ను 10 నిమిషాల ముందుకు జరపామని' బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. దీంతో పాటు మ్యాచ్ టాస్ను రాత్రి 7.20కి బదులు 7.30 గంటలకు మార్చామని ఆట 8 గంటలకు మొదలవుతుందని ఆయన తెలిపారు.
|
టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం పుల్వామా అమరవీరులకే
మరోవైపు ఈ మ్యాచ్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. ధోనీ చేతుల మీదుగా చెక్ను అందిచనున్నట్లు సీఎస్కే డైరెక్టర్ రాకేశ్ సింగ్ ఇంతకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.