

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్కి సర్వం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య శనివారం రాత్రి 8 గంటలకి జరిగే తొలి మ్యాచ్తో తాజా సీజన్కి తెరలేవనుంది. ఆరంభ మ్యాచ్లో కోహ్లీ, ధోని తలపడుతుండటంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఇక, ఈ సారి ఏ జట్టు ట్రోఫీ గెలుస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ అభిమానులకు తీపి కబురు చెప్పారు. ఈ సారి కచ్చితంగా కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.
దీంతో పాటు ఐపీఎల్ 2019 సీజన్లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్లను కూడా ఎవరు సొంతం చేసుకుంటారో మైకేల్ వాన్ ఇప్పుడే చెప్పేశాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్కు ఇచ్చే క్యాప్)ను సొంతం చేసుకుంటాడని తెలిపాడు.
కోల్కతా నైట్రైడర్స్ స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్కు ఇచ్చే క్యాప్) గెలుచుకుంటాడని మైకేల్ వాన్ అంచనా వేశాడు. ఇక, ఐపీఎల్ టైటిల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుచుకుంటుందని వాన్ తెలిపాడు. ఈ మేరకు మైకేల్ వాన్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.