
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కావడంతో స్వల్ప మార్పులు చేశాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
పంజాబ్ తుది జట్టులో శామ్ కర్రన్, హర్ప్రీత్ సింగ్ స్థానంలో నికోలస్ పూరన్, అంకిత్ రాజ్పుత్లకు చోటు కల్పించినట్లు అశ్విన్ చెప్పాడు. మరోవైపు ఆర్సీబీ భుజం గాయంతో బాధపడుతున్న డేల్ స్టెయిన్ స్థానంలో టిమ్ సౌథీని తుది జట్టులోకి తీసుకున్నట్లు కోహ్లీ వెల్లడించాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లాడిన పంజాబ్ 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా... ఏడు ఓటములతో ఆర్సీబీ మాత్రం ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో ఆర్సీబీ ఆడాల్సిన మిగతా మూడు మ్యాచ్లు ఆ జట్టుకు ఎంతో కీలకం కానున్నాయి.
దీంతో వరుసగా రెండు మ్యాచులు గెలిచి ఊపుమీదున్న కోహ్లీసేన ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్ బరిలో నిలవాలని భావిస్తోంది. మరోవైపు పంబాజ్ సైతం ఈ మ్యాచ్లో ఓడితే మిగతా మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.
ఇదిలా ఉంటే, మొయిన్ అలీకి ఈ సీజన్లో ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్ అనంతరం అతడు వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా సొంత దేశానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో మొయిన్ అలీ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పార్ధీవ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ(కెప్టెన్), మొయిన్ అలీ, మార్కస్ స్టోయినిస్, అక్షదీప్ నాథ్, నవదీప్ షైనీ, టిమ్ సౌథీ, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, మన్దీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), హర్డుస్ విజయిన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, అంకిత్ రాజ్పుత్