
హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో ఆర్సీబీ మరోసారి ఓడిపోయింది. వాంఖడె వేదికగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్లో ముంబై ఓపెనర్లు క్వింటన్ డికాక్ 26 బంతుల్లో 40 (5 ఫోర్లు, 2 సిక్సులు), రోహిత్ శర్మ 19 బంతుల్లో 28 (2 ఫోర్లు, 2 సిక్సులు)తో చక్కటి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ మొయిన్ అలీ వేసిన ఒకే ఓవర్లో పరుగు వ్యవధిలో పెవిలియన్కు చేరారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 9 బంతుల్లో 21 (3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 29 (2 ఫోర్లు, ఒక సిక్స్) సాయంతో దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో వీరిద్దరూ కూడా ఆర్సీబీ చైనామన్ స్పిన్నర్ చాహల్ బౌలింగ్లో ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా 16 బంతుల్లో 37 (5 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించాడు.
దీంతో ముంబై ఇండియన్స్ మరో ఆరు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. పవన్ నేగి వేసిన 19వ ఓవర్లో హార్ధిక్ పాండ్యా (0, 6, 4, 4, 6, వైడ్, 1)తో మొత్తం 22 పరుగులు రాబట్టుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో మెయిన్ అలీ, చాహల్ చెరో రెండు వికెట్లు తీయగా... సిరాజ్కు ఒక వికెట్ పడగొట్టాడు.
ముంబై విజయ లక్ష్యం 172
అంతకముందు ఏబీ డివిలియర్స్ 51 బంతుల్లో 75 (6 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 172 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ (8) వికెట్ను ఆర్సీబీ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్తో కలిసి పార్థివ్ పటేల్ 20 బంతుల్లో 28 (4 ఫోర్లు, ఒక సిక్స్) ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 49 పరుగుల వద్ద పార్థివ్ పటేల్ ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ 32 బంతుల్లో 50 (ఒక ఫోర్, 5 సిక్సులు) డివిలియర్స్తో కలిసి దూకుడుగా ఆడాడు. వీరిద్దరి ఆటతీరుని చూస్తే ఆర్సీబీ స్కోరు 200 దాటేలా కనిపించింది. అయితే, అలీ ఔటైన తర్వాత కాసేపటికే డివిలియర్స్ రనౌట్ కావడంతో స్కోరు బోర్డు ఒక్కసారిగా మందగించింది.
అయితే లసిత్ మలింగ వేసిన ఆఖరి ఓవర్లో స్టోయిన్స్ (0), అక్షదీప్ నాథ్ (0), పవన్ నేగి (0) వరుసగా ఔటయ్యారు. ఆఖరి ఓవర్లో మలింగ మూడు వికెట్లు తీయడంతో ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన మలింగ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
అంతకముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడిన అల్జారి స్థానంలో లసిత్ మలింగ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లాడిన ముంబై నాలుగింట విజయం సాధించి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఒకదానిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. వరుసగా ఆరు ఓటముల పాలైన కోహ్లీసేన ఏడో మ్యాచ్లో పంజాబ్పై గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు ముంబై గత మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడింది.