
హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్కు చేరింది. విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయిర్-2 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి విజయం సాధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
పన్నెండు సీజన్లలో(ఫిక్సింగ్ ఆరోపణలు కారణంగా రెండేళ్లు ఐపీఎల్కు దూరం) చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ పైనల్కు చేరడం ఇది ఎనిమిదోసారి. ఈ విజయంతో చెన్నై ఐపీఎల్ ఫైనల్కు చేరగా... ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్లో ముంబై, చెన్నై జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్కు ఇది 100వ విజయం కావడం విశేషం.
చేధనలో చెన్నై ఓపెనర్లు షేన్ వాట్సన్ (50), డుప్లెసిస్(50) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్లో తొలి నాలుగు ఓవర్లు నిలకడగా ఆడిన ఓపెనర్లు ఐదో ఓవర్ నుంచే విజృంభించారు. ఈ క్రమంలో తొలుత డుప్లెసిస్ హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం జట్టు స్కోరు 81 వద్ద ట్రెండ్ బౌల్ట్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనాతో కలిసి షేన్ వాట్సన్ పరుగుల వరద పారించాడు. హాఫ్ సెంచరీ అనంతరం షేన్ వాట్సన్ కూడా జట్టు స్కోరు 109 పరుగుల వద్ద అమిత్ మిశ్రా బౌలింగ్లో బౌల్ట్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికే విజయం చెన్నై వైపు మొగ్గడంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మన్ నెమ్మదిగా ఆడారు.
చెన్నై బ్యాట్స్మెన్లలో సురేశ్ రైనా(11), అంబటి రాయుడు (20 నాటౌట్) పరుగులు చేయగా.... చివర్లో ధోని(9) సీఎస్కే రెండు పరుగులు చేస్తే విజయం సాధిస్తుందనగా ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో బౌల్ట్, మిశ్రా, అక్షర పటేల్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.
చెన్నై విజయ లక్ష్యం 148
అంతకముందు రిషబ్ పంత్ 25బంతుల్లో 38(2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్కు 148 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ మ్యాచ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 21 పరుగుల వద్ద ఓపెనర్ పృథ్వీషా (5) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (18) జట్టు స్కోరు 37 పరుగుల వద్ద భజ్జీ బౌలింగ్లో ధోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత సీఎస్కే బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టారు.
కోలిన్ మున్రో(27) కూడా ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. దీంతో 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. ఢిల్లీ బ్యాట్స్మెన్లలో రిషభ్ పంత్ ఒక్కడే ఫరవాలేదనిపించాడు. 25 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్తో 38 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్లో డ్వేన్ బ్రావోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
చివరల్లో ఇషాంత్ శర్మ సిక్సర్, ఫోర్తో పది పరుగులు చేయడంతో ఢిల్లీ 147 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, జడేజా, బ్రావో రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టగా ఇమ్రాన్ తాహిర్ ఓ వికెట్ తీశాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
అంతకముందు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. మురళీ విజయ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్కు ధోని తుది జట్టులో చోటు కల్పించాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.