
హైదరాబాద్: హమ్మయ్య! ఎట్టకేలకు ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతా తెరిచింది. మొహాలి వేదికగా శనివారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇదే తొలి విజయం కావడం విశేషం.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
పంజాబ్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లీ(67), డివిలియర్స్(59 నాటౌట్) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆ తర్వాత చివర్లో స్టొయినిస్(28నాటౌట్) చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్ బౌలర్లలో షమీ, రవిచంద్రన్ అశ్విన్లు తలో వికెట్ తీశారు.
గేల్ సెంచరీ మిస్, మొహాలిలో ఆర్సీబీ టార్గెట్ 174
అంతకముందు క్రిస్ గేల్ 64 బంతుల్లో 99 (10 ఫోర్లు, 5 సిక్సులు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీకి 174 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్లో పంజాబ్కు ఓపెనర్లు తొలి పవర్ప్లే ముగిసేసరికి 60 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్కు 66 పరుగులు జోడించిన తర్వాత కేఎల్ రాహుల్(18) ఔటయ్యాడు. చాహల్ వేసిన 7వ ఓవర్ రెండో బంతికి స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన మయాంక్ అగర్వాల్(15) చాహల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీయగా... సిరాజ్, మొయిన్ అలీలు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
అంతకముందు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగింది. టిమ్ సౌథీ స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు పంజాబ్ కూడా పలు మార్పులతో బరిలోకి దిగింది.
ఆండ్రూ టై, మయాంక్ అగర్వాల్, మురుగన్ అశ్విన్లకు పంజాబ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించని ఆర్సీబీ ఈ మ్యాచ్తో బోణీ కొట్టాలని భావిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు పంజాబ్ ఏడు మ్యాచ్లు ఆడి నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.