
హైదరాబాద్: రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ని మన్కడింగ్ రనౌట్ చేసి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బట్లర్ని ఎలాంటి హెచ్చరికలు లేకుండానే అశ్విన్ రనౌట్ చేయడం.. ఆ తర్వాత మ్యాచ్లో పంజాబ్ గెలవడంతో అశ్విన్పై యావత్ క్రికెట్ ప్రపంచం తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న అశ్విన్ తన స్థాయికి తగిన పని చేయలేదని మాజీ క్రికెటర్లు కొందరు అభిప్రాయపడ్డారు. మన్కడింగ్ చేసే ముందు బౌలర్ కనీసం ఒక్కసారైనా బ్యాట్స్మెన్ను హెచ్చరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
అయితే, తాజాగా మొహాలి వేదికగా శనివారం సాయంత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు 9.3 ఓవర్లుకు గాను వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (18), మయాంక్ అగర్వాల్ (19) ఉన్నారు.
ఈ దశలో బౌలింగ్ చేస్తున్న కృనాల్ పాండ్యా బంతి విసరకముందే నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న మయాంక్ అగర్వాల్ క్రీజు వెలుపలికి వెళ్తూ కనిపించాడు. దీంతో మూడో బంతిని విసిరే ముందు బౌలింగ్ని నిలిపివేసిన కృనాల్ పాండ్యా 'మన్కడింగ్' రనౌట్పై హెచ్చరించాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ బంతి విసిరిన తర్వాతే క్రీజు దాటడం కనిపించింది.
క్రీడాస్ఫూర్తి అంటే ఇది అంటూ ఇప్పుడు అశ్విన్ను ఉద్దేశిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. భారత జట్టు తరఫున ఇప్పటి వరకూ కృనాల్ పాండ్యా 11 మ్యాచ్లే ఆడగా.. రవిచంద్రన్ అశ్విన్ మాత్రం అన్ని ఫార్మాట్లలో కలిపి 200పైగా మ్యాచ్లాడాడు. దీంతో అశ్విన్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.