కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు షాక్ తగలనుంది. పంజాబ్ స్టార్ ఓపెనర్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ప్రకటనలో తెలిపాడు. తాజాగా అశ్విన్ మాట్లాడుతూ... బుధవారం ముంబైతో జరిగిన మ్యాచ్లో గేల్ను వెన్ను నొప్పి బాధించింది. ప్రస్తుతం గేల్ పరిస్థితిని అంచనా వేస్తున్నాం. వచ్చే రెండు మూడు రోజుల్లో కోలుకుంటాడో లేదో చూడాలి' అని అశ్విన్ తెలిపాడు. అయితే వెన్ను నొప్పి కారణంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో గేల్ ఫీల్డింగ్ కూడా చేయలేదు.
మరోవైపు పంజాబ్ పేసర్ అంకిత్ రాజ్పుత్కు కూడా గాయంతో బాధపడుతున్నాడు. ముంబైలో మ్యాచ్ సందర్భంగా అతని వేలికి గాయమైంది. తొలి ఓవర్లోనే రాజ్పుత్ గాయపడినా.. నొప్పిని భరిస్తూ మిగిలిన మూడు ఓవర్లు పూర్తి చేసాడు. అయితే ముంబైతో మ్యాచ్లో అంకిత్ రాజ్పుత్ తన కోటా 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీసాడు.
శనివారం రాత్రి పంజాబ్ జట్టు బెంగళూరులో తలపడనుంది. మరి ఇద్దరు ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుండంతో ఈ మ్యాచ్లో ఆడుతారో లేదో మరి. ప్రస్తుతం పంజాబ్ నాలుగు విజయాలతో.. పాయింట్ల పట్టికలో కలకత్తా, ముంబై జట్లతో సమానంగా ఉంది. ఈ సమయంలో పంజాబ్కు విజయం తప్పనిసరి. అయితే నొప్పి కారణంగా క్రిస్ గేల్ మ్యాచ్కు దూరమయితే పంజాబ్కు కష్టాలు తప్పకపోవచ్చు.