

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కి ఆడిన ధావన్.. ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలం సమయంలో తన ధర విషయంలో ఫ్రాంఛైజీతో విభేదించడం.. ఆ తర్వాత ధావన్ను ఢిల్లీ క్యాపిటల్స్కు బదిలీ చేసిన సన్రైజర్స్ అతడి స్థానంలో విజయ్ శంకర్తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను ఆ జట్టు నుంచి తీసుకుంది. కాగా, ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23న ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ మీడియాతో మాట్లాడుతూ "ఐపీఎల్లో ఇప్పటవరకు సమతూకంగా ఉన్న జట్టే విజేతగా నిలుస్తూ వస్తోంది. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మంచి సమతూకంగా ఉంది. జట్టులో నైపుణ్యమున్న ఆల్రౌండర్లు, స్పిన్నర్స్, బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ముఖ్యంగా టాప్-4 బ్యాట్స్మెన్ (శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్) జాతీయ జట్టుకు ఆడుతున్నారు. వీరంతా కాస్త దూకుడుగా ఆడితే, ఢిల్లీ జట్టు కచ్చితంగా ఈ ఏడాది టైటిల్ను గెలుచుకుంటుంది" అని ధావన్ అన్నాడు. టోర్నీలో భాగంగా మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్:
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రాహుల్ తెవాతియా, జయంత్ యాదవ్, మన్జోత్ కల్రా, కాలిన్ మున్రో, క్రిస్ మోరిస్, కగిసో రబాడ, సందీప్ లామిచానే, ట్రెంట్ బౌల్ట్,
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: హనుమ విహారీ (రూ. 2 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 5 కోట్లు), ఇషాంత్ శర్మ (రూ.1.1 కోట్లు), అంకుశ్ బెయిన్స్ (రూ.20 లక్షలు), నాథూ సింగ్ (రూ.20 లక్షలు), కాలిన్ ఇన్గ్రామ్ (రూ.6.4 కోట్లు), షెర్ఫేన్ రూథర్ఫర్డ్ (రూ.1.6 కోట్లు), కీమో పాల్ (రూ.50 లక్షలు), జలజ్ సక్సేనా (రూ.20 లక్షలు), బండారు అయ్యప్ప (రూ.20 లక్షలు).