
నేను ధైర్యంగా ఉన్నాను.. 'ఎంఎస్ ధోనీ రనౌట్' ట్వీట్ను డిలీట్ చేసిన అనంతరం న్యూజీలాండ్ ఆటగాడు జిమ్మీ నీశమ్ చేసిన ట్వీట్ అది. హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నై సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు కొనసాగిన ఈ థ్రిల్లర్ మ్యాచ్లో కేవలం ఒకే పరుగు తేడాతో ముంబై విజేతగా నిలిచింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే మ్యాచ్ అంతటికీ చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ రనౌట్ హైలెట్ అయింది. హార్దిక్ వేసిన 13వ ఓవర్ నాలుగో బంతిని వాట్సన్ షాట్ ఆడగా.. ధోనీ సింగిల్ పూర్తి చేశాడు. అయితే మలింగ ఓవర్త్రో కారణంగా మరో రన్ కోసం ప్రయత్నిస్తూ.. ధోనీ నాన్స్ట్రయిక్ ఎండ్ వైపు పరుగెత్తుతున్నాడు. ఇదే సమయంలో బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ నేరుగా వికెట్లకు విసిరాడు. దీంతో గ్రౌండ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సహాయం కోరాడు. థర్డ్ అంపైర్ నిగేల్ లాంగ్ వివిధ యాంగిల్లలో విశ్లేషణ జరిపి ఔట్గా ప్రకటించాడు. ఓ యాంగిల్లో ధోనీ బ్యాట్ ఆన్లైన్ ఉన్నట్టు కనిపించగా.. మరో యాంగిల్లో అంగుళం తేడాతో బయట ఉన్నట్టు రీప్లేలో కనిపించింది. దీంతో ధోనీ రనౌట్ అయ్యాడా? లేదా? అని ఇప్పటికీ అర్ధం కావడం లేదు.
ధోనీ రనౌట్పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు కొందరు ధోనీకి అండగా నిలబడగా.. మరికొందరు ఔట్ అని ట్వీట్లు చేశారు. న్యూజీలాండ్ ఆటగాడు జిమ్మీ నీశమ్ కూడా ఓ యాంగిల్లో ధోనీ బ్యాట్ ఆన్లైన్ ఉన్నట్టు కనిపించే ఫొటో పెట్టి ఇది కచ్చితంగా నాటౌట్ అని ట్వీట్ చేసాడు. దీనికి అభిమానుల నుండి విమర్శలు వచ్చాయి. అవి భరించలేని జిమ్మీ తన ట్వీట్ను డిలీట్ చేసి 'నేను ధైర్యంగా ఉన్నాను' అని మరో ట్వీట్ చేసాడు. ట్వీట్ డిలీట్ చేయడానికి గల కారణాలను కూడా వివరించాడు.