తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ
దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్గా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (14) నాలుగో ఓవర్లోనే పెవిలియన్ చేరిపోగా.. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2) నిరాశపరిచాడు.
యువరాజ్ హాఫ్ సెంచరీ
ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ డికాక్ (27) కూడా ఔటడంతో ముంబై 45/3తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెటరన్ ఆటగాళ్లు యువరాజ్, పొలార్డులు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ మ్యాచ్లో యువరాజ్(53)మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. కీలక సమయంలో ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్యా (0) కూడా ఔటవడంతో మ్యాచ్పై ముంబై పట్టుజారింది.
37 పరుగుల తేడాతో ముంబై ఓటమి
దీంతో 19.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసి 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ "జట్టు అవసరాలను బట్టి నేను ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం. ప్రతీరోజూ కొత్త మెళకువలు నేర్చుకుంటా. మా జట్టు గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. పరిస్థితులను బట్టి నేను బ్యాటింగ్ శైలిని మార్చుకుంటా" అని అన్నాడు.
పంత్ మాట్లాడుతూ
"అలాగే ఈసారి రన్రేట్ పెంచాలనుకున్నా. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. టీ20ల్లో ఏదైనా కొత్తగా చెయ్యాలి. ప్రత్యర్థి అవకాశం తీసుకునేలోపే మనమే అవకాశం తీసుకోవాలి" అని పంత్ తెలిపాడు. ఈ మ్యాచ్లో పంత్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్లో ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో పంత్ 18 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
ధోని రికార్డు బద్దలు
దీంతో 2012 సీజన్లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చేసిన వేగవంతమైన హాఫ్ సెంచరీ (20 బంతుల్లో) రికార్డుని పంత్ అధిగమించాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీని సాధంచిన ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రాహుల్ గత సీజన్లో కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. సునీల్ నరైన్, యూసుఫ్ పఠాన్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించిన ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.