
హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. టోర్నీలో భాగంగా బుధవారం విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఈ ఓటమితో సన్రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి తప్పుకోగా.... శుక్రవారం ఇదే స్టేడియంలో జరగనున్న క్వాలిఫయిర్ 2 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్(గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్) ప్లేఆఫ్స్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. 2012 ఐపీఎల్ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరుకోవడమే ఇప్పటివరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ పృథ్వీ షా 38 బంతుల్లో 56(6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించగా... రిషబ్ పంత్ 21 బంతుల్లో 49(2 ఫోర్లు, 5 సిక్సులు) మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఢిల్లీ విజయ లక్ష్యం 163
అంతకముందు ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 19 బంతుల్లో 36(ఫోర్, 4 సిక్సులు)తో రాణించడంతో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్కు 163 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్లో ఓపెనర్ వృద్దిమాన్ సాహా(8) మరోసారి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్(36) పరుగులతో రాణించాడు. దూకుడుగా ఆడే క్రమంలో అమిత్ మిశ్రా బౌలింగ్లో కీమో పాల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్... మనీశ్ పాండేతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
సన్రైజర్స్ స్కోరు బోర్డు ఊపందుకున్న తరుణంలో మనీశ్ పాండే(30)ను కీమో పాల్ ఔట్ చేశాడు. మనీష్ పాండే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్లో షాట్కు యత్నించి అక్సర్ పటేల్కు క్యాచ్గా చిక్కి వెనుదిరిగాడు.
అనంతరం కెప్టెన్ కేన్ విలియమ్సన్(28) ఔటయ్యాడు. అయినప్పటికీ విజయ్ శంకర్.... మహ్మద్ నబీతో కలిసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. జట్టు స్కోరు 147 పరుగుల వద్ద విజయ్ శంకర్(25) ఔటవ్వగా... ఆ తర్వాత వెంటనే నబీ(20) కూడా పెవిలియన్కు చేరాడు. కీమో పాల్ వేసిన చివరి ఓవర్లో సన్రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయింది.
చివర్లో విజయ్ శంకర్, నబీలు దూకుడుగా ఆడటంతో హైదరాబాద్ 162 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ను సాధించగలిగింది. ఢిల్లీ బౌలర్లలో కీమో పాల్ మూడు వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ రెండు.. బౌల్ట్, మిశ్రాలు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
అంతకముందు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. ఢిల్లీ జట్టులో కొలిన్ ఇంగ్రామ్ స్థానంలో కొలిన్ మన్రో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు సన్రైజర్స్ తుది జట్టులో ఈ సీజన్లో వరుసగా విఫలమవతుతున్న యూసఫ్ ఫఠాన్ స్థానంలో దీపక్ హుడాకు చోటు కల్పించింది.