హైదరాబాద్: యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ల అనుభవం కారణంగానే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన చేస్తోందని ఆ జట్టు సలహాదారు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
అంతేకాదు ఏడేళ్లలో తొలిసారి ప్లేఆఫ్కు చేరింది. ఢిల్లీ విజయాల్లో ధావన్, రబాడ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరోవైపు చెన్నై కూడా 8 మ్యాచ్ల్లో విజయం సాధించినప్పటికీ రన్ రేట్ విషయంలో ఢిల్లీ కాస్త మెరుగ్గా ఉంది.
టోర్నీలో భాగంగా బుధవారం ఈ రెండు తలపడనుంది. ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ "ప్రస్తుతం జట్టులో అనుభవరాహిత్యం అనే పదానికి చోటు లేదు. యువ ఆటగాళ్ల జోరుతో పాటు, సీనియర్ ఆటగాళ్ల అనుభవంతో ప్రస్తుత జట్టు సమతూకంగా ఉంది. శిఖర్ ధావన్ లాంటి అనుభవం కలిగిన ఆటగాడు జట్టులో ఉండటం అతిపెద్ద బూస్టింగ్ లాంటిది" అని అన్నాడు.
"ధావన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడి ఫామ్ ఢిల్లీ క్యాపిటల్స్కు ఎంతో కీలకం. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఓడినప్పటికీ ఢిల్లీ ఆటగాళ్లు ఎక్కడా ఆందోళనకు లోనుకాలేదు. క్రమంగా జట్టుగా పోరాడుతూ తమని తాను నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు" అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
"ఈ విషయంలో పేసర్ కగిసో రబాడ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మిగతా ఫాస్ట్ బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా అన్ని రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నాడు" అని గంగూలీ తెలిపాడు. ఈ సీజన్లో 12మ్యాచ్లాడిన ఢిల్లీ ఎనిమిదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండటంతో పాటు ప్లేఆఫ్స్ బెర్తు కూడా ఖాయం చేసుకుంది.