|
మొదటి మ్యాచ్ ధోని vs కోహ్లీ
ఐపీఎల్ 2019 సీజన్ మొదటి మ్యాచ్లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరిగే మ్యాచ్ల షెడ్యూల్ను ఐపీఎల్ ట్విటర్లో ఉంచారు.
ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన నిర్ణయం
ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓ నిర్ణయం తీసుకుంది. తమ సొంతగ్రౌండ్లో జరిగే తొలి మ్యాచ్ ఆదాయాన్ని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇస్తామని జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది.
పుల్వామా దాడి చాలా బాధకు గురి చేసింది
''మన సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన పిరికిపంద దాడి మమ్మల్ని చాలా బాధకు గురి చేసింది. వారు చేసిన త్యాగానికి మనం వెలకట్టలేం. కానీ వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ సీజన్లో మా సొంతగ్రౌండ్లో జరిగే తొలి మ్యాచ్కి వచ్చే ఆదాయాన్ని సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందిస్తాం. అలాగే ప్రతీ భారతీయుడు కూడా తమ వొంతు సహాయాన్ని అందించాలని కోరుతున్నాం. జై హింద్'' అంటూ పోస్ట్ చేసింది.
మార్చి 26న ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
కాగా ఢిల్లీ వేదికగా ఐపీఎల్ తొలి మ్యాచ్ మార్చి 26న తేదీన ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జవాన్ల కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడితో దేశమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.