ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ కాగిసో రబడ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో రబడ మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండడు. స్వల్ప గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రబడ ఆడలేదు. అయితే.. మే 30న ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రబడకు తగిన విశ్రాంతి అవసరం అని భావించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. అతనిని వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది. బోర్డు ఆదేశాల మేరకు రబడ స్వదేశానికి వెళ్లనున్న కారణంగా పీఎల్కు దూరమయ్యాడు.
ఐపీఎల్ సీజన్-12లో అత్యధిక వికెట్లు పడగొట్టి రబడ టాప్ ప్లేసులో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు12 మ్యాచ్లు ఆడిన రబడ 25 వికెట్లు పడగొట్టాడు. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో మాత్రమే రబడ ఆడలేదు. ఆ మ్యాచ్లో ఢిల్లీ 80 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్నా.. మొదటి రెండు స్థానాల్లో నిలవాలంటే చివరి మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. ఈ సమయంలో రబడ దూరమవడం ఢిల్లీ జట్టును పెద్ద లోటే.
'ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉన్న కీలక దశలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వీడుతున్నందుకు బాధగా ఉంది. ప్రపంచకప్ దగ్గరలో ఉండడంతో స్వదేశానికి వెళ్లడం తప్పడం లేదు. ఈ సీజన్లో ఢిల్లీ తరపున ఆడటం మర్చిపోలేను. మైదానంలో కానీ డ్రెస్సింగ్ రూమ్ ఏదైనా చాలా ఎంజాయ్ చేశా. ఢిల్లీ జట్టు ఐపీఎల్ కప్ సాధిస్తుంది' అని రబడ పేర్కొన్నారు.